మాగోడు వినరా: నగ్నంగా ఉండి నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు..ఎందుకంటే..?
జర్మనీ: ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తున్న నేపథ్యంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుండి చికిత్స అందిస్తున్నారు. వైద్యులే కాదు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఇలా ఎందరో తమ ప్రాణాలను రిస్క్లో ఉంచి కరోనావైరస్ కట్టడికి పనిచేస్తున్నారు. ఇది ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వీరే ముందుండి పనిచేస్తున్నారు. తాజాగా ఓ దేశంలో వైద్యులు వినూత్న నిరసనకు దిగారు. అయితే వారిపై పేషెంట్లు దాడి చేసినందుకు నిరసనలు చేపట్టలేదు... ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నగ్నంగా ఉండి నిరసనలు
జర్మనీలో వైద్యులు నిరసనకు దిగారు. కరోనావైరస్ కట్టడిలో ముందువరసలో ఉండి సేవలందిస్తోన్న వైద్యులే సహనం కోల్పోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నగ్నంగా ఉండి నిరసన తెలిపారు. అయితే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిస్తే వారి ఆవేదన అర్థం అవుతుంది. వారిపై పేషెంట్లు దాడి చేశారని నిరసనకు దిగలేదు. నిత్యం డ్యూటీలో నిమగ్నమై ఉన్నవారికి వ్యక్తిగత సురక్షిత పరికరాలు (పీపీఈ)లు కొరత ఉండటంతో వారు సహనం కోల్పోయారు. పేషెంట్ దగ్గరకు వెళ్లాలంటే ఇవన్నీ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పీపీఈలు కొరత ఉండటంతో వారు సహనం కోల్పోయి ఇలా నగ్నంగా నిల్చుని నిరసన వ్యక్తం చేశారు.
సహనం కోల్పోయామంటున్న వైద్యులు
ఇప్పటి వరకు వ్యక్తిగత సంరక్షణ కిట్లు లేకపోయినప్పటికీ ముందుండి సేవలు చేశామని చెప్పిన వైద్యులు ఇక సహనం లేదని వ్యాధి విజృంభిస్తోందని చెబుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. నగ్నంగా ఉండి నిరసనలు చేస్తున్నామంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. హాస్పిటల్లోనే ఉంటూ టాయ్లెట్స్ మాటున, కుర్చీల వెనకాల, ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ వెనకాల నగ్నంగా ఉండి నిరసనలు తెలిపారు. ఫ్రెంచి డాక్టర్ ఒకరు ఇలానే నిరసన తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చిందని అతన్నుంచే తాము స్ఫూర్తి పొంది ఇలాంటి నిరసనకు దిగామని వైద్యులు చెప్పారు.
జనవరి నుంచే పీపీఈల కొరత
కరోనావైరస్తో బాధపడుతున్న పేషెంట్లకు చికిత్స చేయాల్సిందే. అయితే వారి దగ్గరకు వెళ్లాలంటే ముందుగా తమకు పీపీఈలు లేవని ఓ మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది. గాయాలకు కుట్లు వేసే బాధ్యత తనదని ఇప్పుడు తనకు తానే కుట్లు వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరిలో దేశంలోకి కరోనావైరస్ ఎంటర్ అయినప్పటి నుంచి పీపీఈల కోసం వైద్యులు పట్టుబడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
Recommended Video
డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేదు
ఇక పరిస్థితి తీవ్రతరంగా మారుతుండటంతో జర్మనీ సంస్థలు తమ ఉత్పత్తని పెంచినప్పటికీ వస్తున్న డిమాండ్కు తగ్గట్టుగా ఆ ఉత్పత్తి లేదని సమాచారం. ఇక జర్మనీ దేశంలో మాస్కులు, శానిటైజర్లు, ఇతర క్రిమి సంహారక మందులను పెద్ద ఎత్తున దొంగతనం చేస్తున్నారు. ఇవన్నీ కొన్ని క్రిమినల్ గ్యాంగులే చేస్తున్నాయని జర్మనీ పోలీసులు చెప్పారు. దీంతో చాలా వరకు హాస్పిటల్స్ భద్రతను పెంచి మరింత కట్టుదిట్టం చేశాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం దీనిపై స్పందించింది. పీపీఈ కొనుగోళ్లను కేంద్రీకృతం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.