నిషేధం.. జర్మనీలో హెజ్బుల్లాకు షాక్.. యాక్టివిస్టులను జల్లెడ పడుతున్న పోలీసులు..
రాజకీయ పార్టీ హెజ్బుల్లాను జర్మనీ గడ్డపై నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇరాన్ మద్దతుతో ఈ షియా లెబనీస్ పార్టీ జర్మన్ గడ్డపై పనిచేయగలిగింది. ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థగా దీనిపై ముద్రపడింది. హసన్ నస్రల్లా సారథ్యంలో పనిచేస్తున్న ఈ పార్టీపై ఇప్పటికే చాలావరకు యూరోపియన్ దేశాలు నిషేధం విధించగా.. తాజాగా జర్మనీ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది.
జర్మనీలో దాదాపు 1050 హెజ్బుల్లా యాక్టివిస్టులు..
ఈ తీవ్రవాద సంస్థకు చెందినవారు జర్మనీలో దాదాపు 1050 మంది ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్ ఫాలియా,బ్రెమెన్,బెర్లిన్ ప్రాంతాల్లోని పలు మసీదుల్లో గురువారం(ఏప్రిల్ 30) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సంస్థ క్రిమినల్ లా నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలున్నాయి. అలాగే అంతర్జాతీయ దృక్పథంతో పనిచేసే ధోరణికి కూడా ఇది వ్యతిరేకమని జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్లో పేర్కొంది.
పలు దాడుల్లో ఆరోపణలు..
హెజ్బుల్లా అంటే దేవుడి పార్టీ అని అర్థం. లెబనాన్ రాజకీయాలను ప్రభావితం చేసే స్థితిలో ఈ పార్టీ కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ప్రభుత్వానికి దీని మద్దతు ఉంది. ఇజ్రాయెల్తో పాటు అమెరికా,పలు యూదు సంస్థలపై జరిగిన దాడుల్లో హెజ్బుల్లాపై ఆరోపణలున్నాయి. జర్మనీ విధించిన నిషేధంతో.. ఇకనుంచి అక్కడ హెజ్బుల్లాకి సంబంధించిన చిహ్నాలు కనిపించకూడదు. అలాగే మీడియాలో దాని ప్రచురణలపై పూర్తి నిషేధం ఉంటుంది. హెజ్బుల్లా ఆస్తులను జప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఆ కమాండర్పై అమెరికా నజరానా..
అంతకుముందు,ఏప్రిల్ నెల ఆరంభంలో హెజ్బుల్లా కమాండర్ షేక్ మహమ్మద్-అల్-కతారని సమాచారం ఇచ్చినవారికి 10మిలియన్ డాలర్ల నజరానాను అమెరికా ప్రకటించింది. గతంలో అమెరికా వైమానిక దాడుల్లో మృతి చెందిన ఇరాన్ కుర్దు దళాల కమాండర్ కాసిం సులేమానీకి షేక్ మహమ్మద్-అల్-కతారని సన్నిహితుడు. అమెరికా,కెనడా,యూకె,ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోనూ ఈ సంస్థపై టెర్రరిస్ట్ ముద్ర ఉంది.