గిరిరాజ్కు, రేపిస్ట్కు తేడా లేదు: నిర్భయ డాక్యుమెంటరీ డైరెక్టర్ తీవ్ర వ్యాఖ్య
లండన్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పైన నిర్భయ డాక్యుమెంటరీ డైరెక్టర్ లెస్లీ ఉడ్విన్ ఘాటుగా స్పందించారు. గిరిరాజ్ సింగ్కు, రేపిస్ట్కు ఏమాత్రం తేడా లేదని మండిపడ్డారు.
గిరిరాజ్ వ్యాఖ్యలు వింటుంటే తనకు నిజంగానే అసహ్యం వేస్తోందన్నారు. ఢిల్లీలో పాశవిక లైంగిక దాడికి గురైన ప్రాణాలు కోల్పోయిన పారామెడికల్ విద్యార్థిని పైన తాను తీసిన డాక్యుమెంటరీ చిత్రం లైంగిక దాడులు చేసే వారికి మరింత ఊతమిచ్చేలా ఉందని కపమటమాటలు చెప్పారని, ఇప్పుడేమే స్వయంగా ప్రజాప్రతినిధి మహిళలను అవమానించేలా మాట్లాడారని విమర్శించారు.
గిరిరాజ్ సింగ్ రేపిస్టు కన్నా పెద్ద మంచివారేం కాదన్నారు. అయినా ఎలాంటి ఆలోచన లేకుండా వ్యాఖ్యలు చేసే ఇలాంటి వారిని భారత పార్లమెంటు కొన్నేళ్లుగా ఎందుకు అనుమతిస్తుందో అర్థం కావడం లేదన్నారు. వీరి మాటలకు జైలులో ఉన్న రేపిస్టు ముఖేష్ సింగ్ మాటలకు తేడా ఏమైనా ఉందా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అలాంటి మంత్రిని సహించకూడదని కోరారు. గిరిరాజ్ సింగ్ను బాధ్యతల నుండి తప్పించాలన్నారు. మనం ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఎవరైనా బాధ్యతల నుండి తప్పించాలన్నారు.
కాగా, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెల్లతోలు ఉండటం వల్లనే కాంగ్రెస్ వర్గాలు ఆమెను అధ్యక్షురాలిగా అంగీకరించాయని, రాజీవా గాంధీ నైజీరియన్ను వివాహం చేసుకుంటే అంగీకరించేవారు కాదని గిరిరాజ్ సింగ్ అన్న వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, లెస్లీ ఉడ్విన్.. నిర్భయ డాక్యుమెంటరీ తీసి వెలుగులోకి వచ్చారు.