వీడు అసలు తండ్రేనా: ఫేస్బుక్లో కూతురి వేలం ప్రకటన..ఎంతకు అమ్మాడో తెలుసా?
దక్షిణ సూడాన్ : డబ్బు కోసం కన్న కూతురినే అమ్మకానికి పెట్టిన ప్రబుద్ధుడి ఘటన దక్షిణ సూడాన్లో చోటుచేసుకుంది. తన కూతురును పెళ్లి చేసుకోవాలంటే తనకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలంటూ ఏకంగా సోషల్ మీడియాలోనే ప్రకటన ఇచ్చేశాడు. తన కూతురికి 16 ఏళ్లు అని ఎవరికైనా నచ్చితే డబ్బు చెల్లించి తీసుకెళ్లొచ్చంటూ ఫేస్బుక్లో బహిరంగ పోస్టు చేశారు. ఇది చూసిన చాలా మంది ఔత్సాహికులు అమ్మాయిని తీసుకెళ్లేందుకు ఉత్సాహం చూపించారు.
భారీగా డబ్బులు చెల్లించి చిన్నారిని సొంతం చేసుకున్న వ్యక్తి
ప్రకటన కాస్త వైరల్ కావడంతో కొందరు అమ్మాయిని తీసుకెళ్లేందుకు క్యూ కట్టారు. అయితే డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేయడంతో వారు వెనక్కు తగ్గారు. చివరిగా ఓ వ్యక్తి 500 ఆవులు, మూడు కార్లు, 10వేల డాలర్లు చెల్లించి అమ్మాయిని తీసుకెళ్లాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఈ పోస్టు వైరల్ అవుతుండటంతో ఫేస్ బుక్ యాజమాన్యం ఓ కన్నేసింది. దీనిపై ఆరా తీసింది . అమ్మాయిని కొనేందుకు మొత్తం ఐదుగురు వ్యక్తులు పోటీపడ్డారని చివరికి అధికమొత్తంలో డబ్బులు, కానుకలు చెల్లించిన వ్యక్తికే అమ్మాయిని కట్టబెట్టారని ఫేస్బుక్ విచారణలో తేలింది. ఇలా అమ్మాయి కోసం వేలంపాట పాడిన వారిలో ఆదేశ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు పిల్లల హక్కుల సంస్థ ప్లాన్ ఇంటర్నేషనల్ తెలిపింది.
పోస్టు వైరల్ అయిన 15 రోజులకు తొలగించిన ఫేస్బుక్
ఇదిలా ఉంటే పోస్టు అప్పటికే వైరల్ అయి 15 రోజులు గడిచిందని ఇది గమనించి తాము వెంటనే పోస్టును తొలగించినట్లు ఫేస్బుక్ యాజమాన్యం పేర్కొంది. ఇక అమ్మాయి గురించి విచారణ చేసి వివరాలు కనుగొనే సరికి ఆలస్యం అయిపోయిందని ఈలోపే అమ్మాయి వివాహం కూడా జరిగిపోయిందని ఫేస్ బుక్ తెలిపింది. ఇది ఇలానే వదిలేసి ఉంటే ఇలాంటి పోస్టులనుంచి స్ఫూర్తి తీసుకుని డబ్బు కోసం చాలామంది ఇదే పద్ధతిని అవలంబించే అవకాశం ఉందని ఫేస్ బుక్ యాజమాన్యం తెలిపింది. చిన్నపిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన పోస్టులు, పేజీలు, ప్రకటనలు, గ్రూపులను ఫేస్బుక్ వాల్పై పెట్టేందుకు అనుమతించమని యాజమాన్యం తెలిపింది. పోస్టును వెంటనే తొలగించి పోస్టు పెట్టిన వ్యక్తి అకౌంటును శాశ్వతంగా డిలీట్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
చిన్నారి వివాహంపై తల్లి ఆవేదన
అక్టోబర్ 25న అమ్మాయిని బహిరంగ వేళం వేశారని, నవంబర్ 9న పోస్టును గమనించి తొలగించామని ఫేస్బుక్ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే అమ్మాయి తల్లితో తాము మాట్లాడినట్లు చెప్పారు నేషనల్ అలయెన్స్ ఫర్ వుమెన్ లాయర్స్కు చెందిన లాయర్. తన బిడ్డ వివాహంపై తల్లి చాలా అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు.నవంబర్ 3వ తేదీన తన కూతురి వివాహం జరిగిందని తల్లి చెప్పినట్లు లాయర్ వెల్లడించారు. అంతేకాదు ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఇంత డబ్బు ఎదురిచ్చి వివాహం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఆ చిన్నారి తల్లి చెప్పినట్లు లాయర్ వివరించారు.
సుడాన్ లాంటి దేశంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని మరో సామాజిక కార్యకర్త తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఇలాంటి వాటికి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికగా నిలుస్తున్నాయని అన్నారు. అంతేకాదు మహిళల హక్కులను పరిరక్షించడంలో ఫేస్బుక్కు బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫేస్బుక్ మరింత నిఘా పెంచాలని మహిళా హక్కుల నేతలు తెలిపారు.