మీరు నిజంగా పఠాన్ కు పుట్టిన బిడ్డవే అయితే..: మోడీ: ఎస్..నేను పఠాన్ బిడ్డనే..: ఇమ్రాన్
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఏదీ లేదంటూ పాకిస్తాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. పుల్వామా ఉగ్రదాడిని తమ నెత్తిన రుద్దవద్దంటూ ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ప్రకటించారు.
దాడికి, తమకు సంబంధం లేదని అంటూ మీడియా ముఖంగా వెల్లడించారు. ఇప్పుడు ఆయన గొంతు మారింది. కాస్త మెత్తబడ్డారు. మెట్టు దిగారు. పుల్వామా ఉగ్రవాదుల దాడికి సంబంధించిన సరైన ఆధారాలను తమకు ఇవ్వగలిగితే, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇమ్రాన్ ఖాన్ స్వరం మారడానికి కారణం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవలే చేసిన ఓ ప్రకటన దీనికి ప్రధాన కారణం. పఠాన్ కుటుంబంలో జన్మించిన బిడ్డవే అయితే, ఉగ్రవాదులపై, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.. అని అంటూ మోడీ పాకిస్తాన్ ప్రధానికి సవాలు విసిరారు. పఠాన్ల కుటుంబంలో జన్మించిన వారెవెరూ ఇలా మాటలు మార్చరని చురకలు అంటించారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇమ్రాన్ కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నారు.
తాను పఠాన్ల బిడ్డనేనని, నిజం మాట్లాడతానని, నిజాన్ని అనుసరిస్తానని ఇమ్రాన్ చెప్పారు. తనకు కొంత గడువు కావాలని కోరారు. కొంత సమయం ఇస్తే, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతానని అన్నారు. 2015 తాను మోడీని కలిశానని, తాను అధికారంలోకి వస్తే దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రాధాన్యత ఇస్తానని మాట ఇచ్చిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేశారు.
చెప్పిన మాట ప్రకారం పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నానని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతాన్ని కల్పించే చర్యలను తాను సమర్థించబోనని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం తాను తీసుకుంటున్న చర్యలకు ఉగ్రవాద కార్యకలాపాలు అడ్డంకిగా మారాయని అన్నారు. తనకు కొంత గడువు ఇవ్వాలని, ఉగ్రవాదులను అణచి వేస్తానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పుల్వామా దాడి ఉగ్రవాదుల పనేనని చెప్పడానికి సాంకేతికపరమైన, సరైన సాక్ష్యాధారాలను అందిస్తే, కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.