కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ఇండియాలో ఆందోళనకరం.. గ్లోబల్గా 10 లక్షల మందికి వైరస్..
20వ శతాబ్దంలో స్పానిష్ ఫ్లూ ఏకంగా ఐదు కోట్ల మందిని బలితీసుకుంది. అప్పటితో పోల్చుకుంటే, వైద్య సౌకర్యాలు చాలా వరకు మెరుగుపడినప్పటికీ.. ప్రస్తుత 21వ శతాబ్దంలో కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య కూడా 50 వేలకు దగ్గరగా వెళుతున్నది. దాదాపు అన్ని దేశాలను కబళించిన కరోనా.. ప్రపంచమే లాక్ డౌన్ అయ్యేందుకు కారణమైంది. అనూహ్యరీతిలో అభివృద్ధి చెందిన దేశాలే వైరస్ బాధిత జాబితాలో ముందువరసలో ఉండటం మిగతాదేశాలను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నది.
అమెరికా విలవిల..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కాటుకు గురైనవాళ్లు, దాని కారణంగా చనిపోతున్నవాళ్ల సంఖ్య భారీగా ఉంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం వరకు అక్కడ పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 2లక్షల 15వేల 5వందలుగా నమోదైంది. ఇప్పటికే 5,112 మంది చనిపోగా, మరో 5వేల మంది ఆస్పత్రుల్లో క్రిటికల్ కండిషన్ లో ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్నారు. మిగతా దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో కొవిడ్-19 నుంచి రికవరీ అవుతోన్న వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం కేసుల్లో కేవలం 8,878 మంది మాత్రమే క్యూర్ అయ్యారు. స్పానిష్ ఫ్లూ, రెండో ప్రపచ యుద్ధం, 9/11 ఉగ్రదాడుల తర్వాత ఒకేసారి ఇంత మంది జనం బలైపోతున్నది కరోనాకే కావడం గమనార్హం. ఇప్పటికే దేశవ్యాప్త హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం.. వైరస్ పై పోరులో రష్యా, చైనా సహకారం తీసుకుంటున్నది.
మరణాలు అక్కడే ఎక్కువ..
ప్రజారోగ్యం, పరిపాలన విషయాల్లో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే యూరప్ దేశాలు కరోనా ధాటికి చివురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఎక్కువ మరణాలు ఇక్కడే సంభవిస్తుండటం, కేసుల సంఖ్య కూడా భారీగా ఉండటం యూరోపియన్లను కలవరపెడుతున్నది. అందరికంటే ఎక్కువగా ఇటలీలో ఇప్పటిదాకా 13,155 మంది కరోనాకు బలయ్యారు. అక్కడింకా 1.10 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. అందులో 4వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. స్పెయిన్ లో కరోనా మరణాలు 10 వేలకు దాటాయి. ఇప్పటికే 9,387 మంది చనిపోగా, దాదాపు 6 వేల మంది కండిషన్ క్రిటికల్ గా ఉంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య లక్షకుపైగానే కొనసాగుతున్నది. ఫ్రాన్స్ లో కేసుల సంఖ్య 56 వేలే అయినప్పటికీ మరణాలు మాత్రం 4వేలు దాటాయి. వైరస్ అతివేగంగా వ్యాపిస్తున్న జర్మనీ(78వేలు).. కేసుల సంఖ్యలో త్వరలోనే చైనా(81వేలు)ను దాటే పరిస్థితి నెలకొంది. బ్రిటన్ లో దాదాపు 30 వేల మందికి పాజిటివ్, 2,352 మరణాలు సంభవించాయి.
ఇదీ ఇండియా పరిస్థితి..
నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం తర్వాత మన దేశంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. గురువారం మధ్యాహ్నం నాటికి వైరస్ సోకినవాళ్ల సంఖ్య 2105గా ఉంది. ఇప్పటికే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత రాష్ట్రాల జాబితాలో 132 కేసులతో ఏపీ, తెలంగాణలు ఐదో స్థానంలో ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వచ్చే బులిటెన్లను బట్టి మనం.. ఢిల్లీ(152 కేసులు)ని దాటే అవకాశాలున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 3339 మంది, కేరళలో 265 మంది, తమిళనాడులో 234 మందికి వైరస్ సోకింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోదీ గురువారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన చర్యల్ని నిర్దేశించారు.
Recommended Video
వ్యాక్సిన్ ప్రయత్నాలు..
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో దాదాపు అన్ని దేశాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈలోపే, మహమ్మారికి విరుగుడు మందు కనిపెట్టామంటూ పలు దేశాల నుంచి రోజుకు ఒకరో ఇద్దరో ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. వాటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాటిని ధృవీకరించడంలేదు. ప్రస్తుతానికి కరోనాకు మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని, ప్రజలు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, సాధ్యమైనంతలో పరిశుభ్రంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో తెలిపింది. కరోనా కట్టడిలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ సంస్థ ప్రశంసించింది.