కొంపముంచిన రాన్సమ్వేర్, ఒకేరోజు 99 దేశాలపై సైబర్ దాడి.. స్తంభించిన లక్షల కంప్యూటర్లు
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై సైబర్ దాడులు జరిగాయి. ఒకేరోజు దాదాపు 99 దేశాల్లో 75వేల సైబర్ దాడులు జరిగినట్లు సైబర్ సెక్యూర్టీ సంస్థ అవాస్ట్ ఆందోళన వక్తం చేసింది.
వాషింగ్టన్: నిన్న శుక్రవారం.. ఎవరూ మరచిపోలేని రోజు. ఎందుకంటే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై సైబర్ దాడులు జరిగాయి. సుమారు 99 దేశాలలోని వివిధ సంస్థలపై సైబర్ అటాక్ జరినట్లు తెలుస్తోంది. లక్షల సంఖ్యల్లో కంప్యూటర్లను రాన్సమ్వేర్ సాఫ్ట్వేర్ లాక్ చేసినట్లు సమాచారం.
ఒకేరోజు దాదాపు 99 దేశాల్లో 75వేల సైబర్ దాడులు జరిగినట్లు సైబర్ సెక్యూర్టీ సంస్థ అవాస్ట్ ఆందోళన వక్తం చేసింది. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, తైవాన్ దేశాల్లో ఈ దాడులు ఎక్కువగా జరిగినట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.
లక్షల సంఖ్యలో కంప్యూటర్ల మొరాయింపు..
అమెరికాకు చెందిన జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన సైబర్ టూల్స్తోనే ఈ దాడులు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాన్సమ్వేర్ సాఫ్ట్వేర్ క్యంపూటర్లను లాక్ చేస్తుంది. ఫైల్స్ ఓపెన్ కావాలంటే అది డబ్బు డిమాండ్ చేస్తుంది. ఇలా 99 దేశాల్లో లక్షల సంఖ్యల్లో కంప్యూటర్లు ఈ వైరస్ కారణంగా స్తంభించిపోయాయి.
డబ్బిస్తేనే మళ్లీ పనిచేస్తాయి..
బ్రిటన్ లో ఏకంగా ఆసుపత్రులు, క్లినిక్లను మూసివేశారు. కంప్యూటర్లు పనిచేయక పోవడంతో వైద్య సహాయాన్ని నిలిపివేశారు. రాన్సమ్వేర్ వైరస్ను ‘వన్నాక్రై' అని కూడా పిలుస్తారు. ఒకవేళ ఈ వైరస్ నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలి.
300 డాలర్లు ఇస్తేనే...
శుక్రవారం జరిగిన దాడి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బిట్కాయిన్ ద్వారా డబ్బులు కూడా చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆన్లైన్లో మూడు వందల డాలర్లు చెల్లిస్తే కంప్యూటర్ వైరస్ వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.
ఆ ప్యాచ్ ను అప్ డేట్ చేసి ఉంటే.. ఓకే
ద షాడో బ్రోకర్స్ అనే హ్యాకింగ్ బృందం వైరస్ సాఫ్ట్వేర్ను దొంగలించినట్లు అనుమానాలు వస్తున్నాయి. వాళ్లే ఆ వైరస్ను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. అయితే మార్చి నెలలో ఇలాంటి వైరస్లను ఎదుర్కొనేందుకు మైక్రోసాఫ్ట్ ఓ ప్యాచ్ను రిలీజ్ చేసింది. కానీ చాలా వరకు కంప్యూటర్లలో దీనిని అప్డేట్ చేసి ఉండరు.
అతిపెద్ద సైబర్ దాడి ఇదే..
రాన్సమ్వేర్ దాడి వల్ల బ్రిటన్లో సుమారు 16 ఆసుపత్రులు పేషెంట్ల అపాయింట్మెంట్లు రద్దు చేయాల్సి వచ్చింది. కంప్యూటర్లకు వైరస్ పట్టుకోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇది అతిపెద్ద సైబర్ దాడి అని బ్రిటన్ భద్రతా నిపుణులు కెవిన్ బీమోంట్ పేర్కొన్నారు.
స్పెయిన్ లో ‘ఎటర్నల్ బ్లూ’ పేరుతో..
స్పెయిన్కు చెందిన జాతీయ టెలిఫోన్ సంస్థ కూడా వైరస్ తాకిడికి గురైంది. ఎటర్నల్ బ్లూ పేరుతో రాన్సమ్వేర్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని స్పెయిన్ అధికారులు పేర్కొన్నారు.
రష్యాలో 1 శాతం స్తంభించిన కంప్యూటర్లు..
రష్యా ప్రభుత్వం కూడా ఈ సైబర్ దాడిపై ప్రకటన విడుదల చేసింది. సుమారు ఒక శాతం వరకు కంప్యూటర్లు రాన్సమ్ వైరస్ వల్ల ప్రభావానికి లోనైనట్లు పేర్కొన్నది. యాంటీవైరస్ బృందాలు రాన్సమ్వేర్ను ధ్వంసం చేసేందుకు పనిచేస్తున్నట్లు రష్యా వెల్లడించింది.