గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019: అత్యంత శాంతియుత దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?
ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. కొన్ని దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతుండగా మరికొన్ని దేశాల్లో అంతర్గత వ్యవహారాలతో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఎకనామిక్ మరియు పీస్ సంస్థ ప్రపంచ దేశాల్లో ఏయే దేశాలు శాంతి నెలకొందో వాటి ర్యాంకులను విడుదల చేసింది. మొత్తం 163 దేశాలకు ర్యాంకులను విడుదల చేసింది.
ఏఎన్-32 కూలిన ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బంది
దిగజారిన భారత్ స్థానం
ప్రపంచంలో శాంతితో ఉన్న దేశాల్లో భారత్కు 141 స్థానం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ ర్యాంకు మరింత దిగజారింది. ఐదు స్థానాలకు పడిపోయి 141వ స్థానం సంపాదించింది. ఇక మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉండగా చివరి స్థానంలో అఫ్ఘానిస్తాన్ నిలిచింది. ఇక ఈ ర్యాంకింగ్లు ఇచ్చేందుకు మూడు ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకుంది సంస్థ. సమాజంలో భద్రత మరియు రక్షణ, దేశ అంతర్గత వ్యవహారాలు, అంతర్జాతీయ వివాదాలు, మిలటరీని ఏ స్థాయిలో వినియోగిస్తున్నారనే మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంది.
2008 నుంచి తొలి స్థానంలో కొనసాగుతోన్న ఐస్లాండ్
ఐస్లాండ్ అత్యంత శాంతితో ఉన్న దేశమని నివేదిక పేర్కొంది. 2008 నుంచి ఐస్లాండ్ తొలిస్థానంలో నిలుస్తోంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఐస్లాండ్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రియా, పోర్చుగల్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయి. చివరి స్థానంలో ఆఫ్ఘానిస్తాన్ ఉంది. అంతకుముందు సిరియా దేశం చివరి స్థానంలో ఉండేది. సిరియా ఇప్పుడు చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక చివరి నుంచి దక్షిణ సూడాన్, యెమెన్, ఇరాక్ దేశాలు ఉన్నాయి.
సహజ విపత్తుల ద్వారా నష్టపోతున్న దేశాలు
దక్షిణాసియాలో అత్యంత శాంతియుత దేశాల్లో భూటాన్ 15వ స్థానంలో నిలువగా, శ్రీలంక 72వ ర్యాంకు, నేపాల్ 76 వస్థానం, బంగ్లాదేశ్ 101వ స్థానాల్లో నిలిచాయి. ఇక దాయాది దేశం పాకిస్తాన్ 153వ స్థానంలో నిలిచింది. ఇక సహజ విపత్తు ద్వారా నష్టపోతున్న దేశాలు భారత్తో పాటు ఫిలిప్పీన్స్, జపాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, ఇండోనేషియా, వియత్నాం, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. సహజ విపత్తు ద్వారా నష్టపోతున్న దేశాల్లో భారత్ స్థానం ఏడుగా ఉందని నివేదిక వెల్లడించింది.
మిలటరీ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలు
భారత్, అమెరికా, చైనా, సౌదీ అరేబియా, రష్యా దేశాలు తమ మిలటరీ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలుగా నిలిచాయని నివేదిక వెల్లడించింది. అంతర్గత వివాదాల పరంగా చూస్తే భారత్ పాకిస్తాన్లకు అత్యధిక రేటింగ్లు ఉన్నాయి. చైనా బంగ్లాదేశ్, ఇండియా దేశాలు సహజ విపత్తులు సంభవించినప్పుడు ఎక్కువగా నష్టపోయే దేశాలుగా మిగిలాయి. దాదాపు 393 మిలియన్ మంది ప్రజలు సహజ విపత్తులు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇక చివరిగా ఉగ్రవాదం అనేది గత పదేళ్లలో తగ్గుముఖం పట్టిందని నివేదిక వెల్లడించింది. 62 దేశాల్లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టగా 42 దేశాల్లో మాత్రం పెరిగిందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని 99.7 శాతం జనాభాను స్టడీ చేసిన తర్వాతే ఈ నివేదిక రూపొందించారు. దీన్ని రూపొందించేందుకు 23 సూచికలను ప్రధానంగా తీసుకుని అత్యంత విశ్వసనీయత ఉన్న సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు రూపొందించడం జరిగింది.