ఈ ఏడాది చివరి వరకే జీమెయిల్ పనిచేసేది.. తర్వాత క్రోమ్ అప్ డేట్ తప్పనిసరి
గూగుల్ కు చెందిన జీమెయిల్ ఈ ఏడాది చివరి తరువాత క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో పని చేయదు. అలాగే విండోస్ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిన విండోస్ ఎక్స్ పీ, విండోస్ విస్టా అధారంగా పని చేసే కంప్యూటర్లలో కూడా.
న్యూయార్క్: గూగుల్ కు చెందిన జీమెయిల్ ఈ ఏడాది చివరి తరువాత క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో పని చేయదని ఆ సంస్థ గురువారం వెల్లడించింది. అలాగే విండోస్ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిన విండోస్ ఎక్స్ పీ, విండోస్ విస్టా అధారంగా పని చేసే కంప్యూటర్లలో కూడా ఇకపై జీమెయిల్ పని చేయదని స్పష్టం చేసింది.
వినియోగదారుల భ్రదత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ పేర్కొంది. తాజాగా తన క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 55ను గూగుల్ తీసుకొస్తోంది. ఇందులో పలు భద్రతా అశాలను మెరుగు పరిచారు.
ఈనెల 8 నుంచి క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 53 కంటే పాతది వాడుతున్న వారికి ఇకమీదట జీమెయిల్ ఓపెన్ చేయగానే అప్ డేట్ చేసుకోవాలని సూచించే ఓ బ్యానర్ కనిపిస్తుంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ తన పాత ఆపరేటింగ్ సిస్టంలు అయిన విండోస్ ఎక్స్ పీ, విండోస్ విస్టా విషయంలో రెండున్నరేళ్ల క్రితమే తన సపోర్టును ఉపసంహరించుకుంది.
అయితే ఇప్పటికీ చాలా మంది వాటినే తమ కంప్యూటర్లలో ఉపయోగిస్తున్నారు. వాటిల్లో క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 49 కంటే పాతవి మాత్రమే పనిచేస్తాయి. ఆ తరువాత వచ్చిన వెర్షన్లు ఈ కంప్యూటర్లలో పని చేయవు. కానీ జీమెయిల్ ఇప్పటి వరకు ఇలాంటి కంప్యూటర్లలో పని చేస్తూనే వస్తోంది.
కానీ ఈ ఏడాది చివర తరువాత ఇక పని చేయదు. వినియోగదారుల ఖాతాల భద్రత రీత్యా తాజా నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. జీమెయిల్ ఉపయోగించాలంటే ఇక క్రోమ్ వినియోగదారులు తప్పనిసరిగా తాజా వెర్షన్లకు అప్ గ్రేడ్ అయి తీరాల్సిందే మరి.. తప్పదు!