ఇండియాకు వెళ్లండి: కరోనా వ్యాక్సిన్ తీసుకోని దేశ పౌరులకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో హెచ్చరికలు
మనీలా: కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు నిరాకరిస్తున్న దేశ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఫిలిప్పీన్స్ అధ్యక్షడు రోడ్రోగో డ్యూటెర్టే. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే అరెస్ట్ చేస్తామని రోడ్రిగో హెచ్చరించారు.
అప్పటికీ టీకా తీసుకోలేదంటే.. భారత్ లేదా అమెరికాలో ఎక్కడికైనా వెళ్లాలంటూ పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే తేల్చిచెప్పారు. తాను తీసుకుంటున్న నిర్ణయం ఎవరికీ నచ్చకపోవచ్చని, అయితే, కరోనా కారణంగా ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్న తరుణంలో కఠిన నిబంధనలు తప్పవని స్పష్టం చేశారు.
కరోనా టీకా తీసుకోని వారు వైరస్ వ్యాప్తి చేస్తూనే ఉంటారన్నారు. అలాంటివారి వల్ల దేశానికే ప్రమాదమని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అంతేగాక, కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికి పందులకు(జంతువులకు) ఇచ్చే ఐవర్ మెక్టిన్ ఔషధం ఇస్తామని హెచ్చరించారు. అప్పుడు వైరస్ తోపాటు మీరు చనిపోతారంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు.
దేశ ప్రజలనుద్దేశించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రోడ్రిగో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. మూర్ఖపు మనుషులు మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవడం లేదనన్నారు. తాను కఠిన చర్యలకు దిగకముందే ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
కరోనా కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాల్లో ఫిలిప్పీన్స్ కూడా ఒకటి కావడం గమనార్హం. బుధవారం ఈ దేశంలో 4353 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు ఈ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,72,232కు చేరింది. ఈ దేశ జనాభా 110 మిలియన్లు.