అమాయకుడ్ని: మాల్యా, విచారణలో అనుకోని ఘటన, ‘లిక్కర్ కింగ్ అక్కడ హీరోనే’
Recommended Video
లండన్: తాను ఏ తప్పు చేయలేదని, తాను నిర్ధోషినని బ్యాంకులకు వేల కోట్లు రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్మాల్యా అన్నారు. కాగా, అతడ్ని వెనక్కి రప్పించడంలో భాగంగా చేపట్టిన విచారణ సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
విచారణకు కొద్దిసేపు ముందు అగ్నిప్రమాదాన్ని హెచ్చరిస్తూ మోగిన అలారంతో కోర్టు గదిని ఖాళీ చేశారు. సుమారు 40 నిమిషాల పాటు విచారణ నిలిచిపోయింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైంది.
నిర్దోషిని
విచారణలో భాగంగా ఇక్కడి వెస్ట్మినిస్టర్ కోర్టుకు చేరుకున్న మాల్యా మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, తాను నిర్దోషినని అన్నారు. తానేంటో కోర్టే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తన అనుచరులతో కలిసి నాలుగు పెద్ద పెద్ద బాక్సుల్లో సాక్ష్యాలను కోర్టు ఆవరణకు తీసుకొచ్చారు. సోమవారం ప్రారంభమైన విచారణ డిసెంబర్ 14 వరకు కొనసాగనుంది. అనంతరం తీర్పు వెలువడనుంది.
9వేల కోట్లు ఎగ్గొట్టి..
విచారణలో భాగంగా భారత్ నుంచి సీబీఐ, ఈడీ బృందం కూడా లండన్ చేరుకుంది. భారత్ బ్యాంకులకు రూ.9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి విజయ్మాల్యా లండన్ పారిపోయినన సంగతి తెలిసిందే. స్కాట్లాండ్ పోలీసులు గతంలోఅతడిని అరెస్ట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే బెయిల్పై బయటకు వచ్చారు. అయితే భారత్, యూకే మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
20లక్షల క్రిస్మస్ ట్రీతో..
కాగా, లండన్ శివారులోని టెవిన్ అనే గ్రామంలో మాల్యా ఉంటున్నారు. ఆ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. లండన్ లో ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తుతూ విజయ్ మాల్యా 20 లక్షల రూపాయల విలువ చేసే క్రిస్మస్ ట్రీని ఆ గ్రామానికి బహుమతిగా అందజేశారు. దీంతో ఆయనంటే టెవిన్ గ్రామస్థులకు ఎనలేని గౌరవం ఏర్పడింది.
మాల్యా గొప్పవాడంటూ..
మాల్యా గొప్ప ధనవంతుడని, ఎంతో గొప్పవాడని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మాల్యాను తమ దేశం నుంచి తీసుకెళ్లవద్దని ముక్తకంఠంతో కోరుతున్నారు. మాల్యా తమ గ్రామానికి గొప్ప ఆస్తి లాంటివాడని పేర్కొంటున్న ఆ గ్రామవాసులు, మాల్యా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నారని, ధనవంతులకు ఇలాంటి సమస్యలు సాధారణమని వారు చెప్పుకు రావడం గమనార్హం.