కోవిడ్-19 ఎఫెక్ట్: పేదరికంలోకి పలు దేశాలు, కుదేలు కానున్న చైనా ఆర్థిక వ్యవస్థ: వరల్డ్ బ్యాంక్
వాషింగ్టన్: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలింది. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో తూర్పు ఆసియా దేశాలు పేదరికంలోకి కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రపంచబ్యాంకు హెచ్చరించింది. కరోనావైరస్ మహమ్మారీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలకు షాక్ ఇచ్చింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయని చెప్పారు వరల్డ్ బ్యాంక్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ చీఫ్ ఎకానమిస్ట్ ఆదిత్య మట్టూ.
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా..?
ఈ మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు కోలుకున్నప్పటికీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఇప్పుడప్పుడే పుంజుకోలేదని స్పష్టం చేశారు ఆదిత్య మట్టూ. ఇందుకు కారణం 6.1శాతంగా ఉన్న చైనా ఆర్థిక వృద్ధి 2.3శాతానికి 2019లో పడిపోవడమే. కరోనావైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడటంతోనే ఈ స్థాయికి చైనా దిగజారిపోయిందని ఆదిత్య చెప్పారు. ఇప్పటికే సగానికి పైగా ప్రపంచ దేశాలు పూర్తి స్థాయిలో లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో చాలా వ్యాపారాలు నష్టం దిశగా అడుగులు వేశాయి. అదే సమయంలో రవాణా కూడా స్తంభించిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అయితే చైనా ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకోవచ్చు కానీ క్షీణతను మాత్రం తప్పిచుకోలేదు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితమే చైనా ఈ సంవత్సరంలో 5.9శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇది 1990 తర్వాత అత్యంత దారుణమైన వృద్ధి రేటు అని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.
దేశాలు ఎప్పుడు కోలుకుంటాయో చెప్పలేం
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థ అయిన చైనా తొలిసారిగా అన్ని రంగాల్లో క్షీణతను చూస్తోంది. ఉత్పత్తి రంగం నుంచి ఇతర రంగాలు కూడా గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరి నెలలో పడిపోయాయి. ఇక చైనాను మినహాయిస్తే ఇతర తూర్పు ఆసియా పసిఫిక్ ప్రాంతపు దేశాలు 1.3 శాతం మేరా వృద్ధిని కోల్పోయాయని ప్రపంచ బ్యాంక్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరోనావైరస్తో ఆయా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయని నివేదిక పేర్కొంది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటాదనేని ఇంకా స్పష్టంగా చెప్పలేమని నివేదిక వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం అప్పటికే ఉన్నందున వృద్ధి రేటు అప్పుడే క్షీణించిందని నివేదిక వెల్లడించింది.
ఈ రంగాలపైనే ఎక్కువ ప్రభావం
ఇదిలా ఉంటే మహమ్మారి నుంచి ఆయాదేశాలు కోలుకున్నప్పటికీ వాటిపై ఉన్న ఆర్థిక ఒత్తిడితో 2020 వరకు కూడా మార్కెట్లు కోలుకోలేవని వరల్డ్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. ఇక ఈ ప్రభావం ఎక్కువగా వాణిజ్యం, పర్యాటక రంగం, కమొడిటీస్పైనే పడుతుందని వివరించింది. ఇదిలా ఉంటే ఈ మహమ్మారితో చాలా దేశాలు పేదరికంలోకి కూరుకుపోతాయని నివేదిక వెల్లడించింది. 70శాతం ప్రపంచ వాణిజ్యంపై ఆధారపడిన 17 దేశాలు కరోనావైరస్ దెబ్బకు తీవ్ర సంక్షోభంలోకి ఇరుక్కుపోయాయని ఆదిత్య మట్టూ చెప్పారు. అంతేకాదు ఈ 17 దేశాల్లోనే అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.
Recommended Video
చైనా వల్ల ఇతర దేశాలపై ప్రభావం
ఒక్క చైనా ఆర్థిక వ్యవస్థ అధికంగా నష్టపోవడం వల్ల ఈ ప్రభావం ఇతర దేశాలపై కూడా పడుతుందని ఆదిత్య చెప్పారు. దక్షిణ కొరియా ఎలా అయితే కోలుకుందో అంటే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు కావాల్సిన టెస్టింగ్లు నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను ఆదిత్య కొనియాడారు. ఇలా చేయగలిగితే తప్పకుండా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇదేదో ఒక రాకెట్ సైన్స్ లాంటిది కాదని.. ఒకరికొకరం సహకరించుకుంటే అంతా సవ్యంగా సాగిపోతుందని ఆదిత్య చెప్పారు.