ట్రంప్కి లోన్గా ఇద్దామనుకున్న బంగారు టాయ్లెట్ అపహరణ: విలువెంతో తెలుసా?
లండన్: బంగారం ఎక్కడుంటే దొంగలు అక్కడుంటారు. ఏ కొంచెం మొత్తం బంగారం కనబడినా దాన్ని ఎప్పుడెప్పుడు దొంగిలిద్దమా? అన్నట్లు ఉంటుంది వారి వ్యవహారం. ఇక కిలోల కొద్దీ బంగారం కనిపిస్తే ఊరుకుంటారా? ఇక్కడా అదే జరిగింది. లండన్లోని బ్లనియమ్ ప్రాసాదంలోని ప్రదర్శనశాలలో ఉన్న 18కేరట్ల బంగారంతో చేసిన మరుగుదొడ్డి(టాయ్లెట్)ను అపహరించుకుపోయారు.
రూ. 8.8కోట్లు విలువైన మరుగుదొడ్డి..
శనివారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగల కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టారు. కాగా, దొంగలు దొంగిలించిన ఆ మరుగుదొడ్డి విలువ రూ. 8.8 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ దొంగలు మరుగుదొడ్డిని దొంగిలించడం గమనార్హం.
ప్రదర్శనకు తీసుకొస్తే..
న్యూయార్క్లోని సోలోమన్ ఆర్ గుగెన్హైమ్ ప్రదర్శనశాల నుంచి రెండ్రోజుల క్రితమే ఈ బంగారు మరుగుదొడ్డిని లండన్ తీసుకువచ్చారు. అక్టోబర్ 27 వరకు దీన్ని బ్లనియమ్ ప్రదర్శన శాలలో ఉంచాలని నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే దొంగలు పడి ఆ కళాఖండాన్ని దొంగలించుకుపోవడంతో నిర్వాహకులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ట్రంప్కి లోన్గా..
బంగారు మరుగుదొడ్డి అపహరణపై లబోదిబోమంటూ ఫిర్యాదు చేయడంతో దొంగల ముఠాను పట్టుకునే పడ్డారు పోలీసులు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, ఈ బంగారు మరుగుదొడ్డిని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి లోన్గా ఇచ్చేందుకు సిద్దపడటం గమనార్హం.