సుందర్ పిచాయ్ భావోద్వేగం - నా కోసం అమ్మ, నాన్న చాలా త్యాగం చేశారు
వాషింగ్టన్: టెక్ దిగ్గజం, టాప్ సెర్చింజిన్ గూగుల్, ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్.. పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు- ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. వాణిజ్యం-పరిశ్రమల విభాగంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన భారతీయుడు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును అందజేసిది. ఈ ఏడాది ఆరంభంలో పద్మ అవార్డులను ప్రకటించిన వారి జాబితాలో సుందర్ పిచాయ్ పేరును చేర్చింది.
ఇదివరకే భారత్లో వారందరికీ రాష్ట్రపతి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సుందర్ పిచాయ్ హాజరు కాలేకపోయారు. దీనితో రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు ఆయనకు దీన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ నాగేంద్ర ప్రసాద్, సుందర్ పిచాయ్ కుటుంబ సభ్యులు, బంధువులు, అతికొద్దిమంది ప్రతినిధులు హాజరయ్యారు. తమిళనాడులోని మధురై సుందర్ పిచాయ్ స్వస్థలం.
పద్మభూషణ్ అవార్డును అందుకున్న తరువాత భావోద్వేగంతో మాట్లాడారాయన. తాను ఎక్కడికి వెళ్లినా భారతీయ తత్వాన్ని వెంట తీసుకెళ్తుంటానని చెప్పారు. తన మూలాలను ఎప్పటికీ మరిచిపోనని పేర్కొన్నారు. తన ఎదుగుదల కోసం తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారని, దీనివల్లే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగానని వ్యాఖ్యానించారు. అభ్యసించడానికి తనకు దక్కిన అవకాశాలు వారి త్యాగ ఫలితమేనని పేర్కొన్నారు.
అనంతరం తరణ్జింత్ సింగ్ సంధూ మాట్లాడుతూ డిజిటలీకరణలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషిస్తోన్నారని అన్నారు. భారత ప్రభుత్వం ప్రతి గ్రామాన్నీ డిజిటలీకరించడానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. స్పీడ్-సింప్లిసిటీ- సర్వీస్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు అత్యంత వేగవంతంగా సరళంగా పూర్తి కావడానికి డిజిటలైజేషన్ ఉపయోగపడుతోందని అన్నారు.
భారత్లో జరుగుతున్న డిజిటల్ విప్లవాన్ని గూగుల్ పూర్తిగా ఉపయోగించుకోవాలని సంధు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో పురోగతిని సాధిస్తుందని, దీనికి గూగుల్ నుంచి మరింత సహకారం ఉంటుందని పేర్కొన్నారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే సాంకేతికతను రూపొందించడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తరణ్జిత్ చెప్పారు.