తీవ్ర విషాదం, ఇప్పుడు మీరంతా షాక్లో: ఫైరింగ్పై సుందర్ పిచాయ్ ఈమెయిల్
Recommended Video
వాషింగ్టన్: అమెరికాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు పాల్పడిన నేపథ్యంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు మెయిల్ పంపించారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు.
ఈ రోజు జరిగిన విషాధాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదని, ఉద్యోగులకు అండగా నిలబడటంపై దృష్టి సారించామని, ఇలాంటి సందర్భంలో యూట్యూబ్ కమ్యూనిటీ అంతా ఏకతాటిపై ఉండాలని, తక్షణమే స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
అమెరికాలోని శాన్బ్రూన్లో గల యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అనంతరం ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాల్పుల మోత: ఉలిక్కిపడ్డ యూట్యూబ్.. తనను తాను కాల్చుకున్న మహిళ
యూట్యూబ్ కార్యాలయం వద్ద కాల్పులు
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాల్పులకు పాల్పడిన మహిళే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
పదిరౌండ్ల కాల్పులు
కాల్పుల ఘటనతో కార్యాలయంలోని ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం పది రౌండ్లు తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్యోగులు ప్రాణభయంతో పరుగు తీశారు. యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో మొత్తం 1,700 మంది ఉద్యోగులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బాధితులకు సంఘీభావం తెలిపారు. సకాలంలో స్పందించిన లా అండ్ ఎన్పోర్స్మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
గంటల్లో సుందర్ పిచాయ్ స్పందన
యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న కొద్ది గంటల తర్వాత సుందర్ పిచాయ్ అక్కడ జరిగిన సంఘటనను మెయిల్ ద్వారా తెలిపారు. ఇది ఊహించని విషాదం, హింసాత్మక చర్య అని పేర్కొన్నారు.
భవనం ఖాళీ చేయించారు
మధ్యాహ్నం ఉద్యోగులు లంచ్ చేసే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని, లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు మన సెక్యూరిటీ టీం వెంటనే స్పందించారని, ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో పెట్టుకొని భవనం నుంచి ఖాళీ చేయించారని సుందర్ పిచాయ్ మెయిల్లో పేర్కొన్నారు.
అందరికీ కృతజ్ఞతలు
తనకు తెలిసిన తాజా సమాచారం వరకు నలుగురు గాయపడ్డారని, ఇది బాధాకరమని, ఈ సమయంలో వారికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. కంపెనీ లోపల, బయట ఉన్న వారు అండగా నిలిచారని, అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
అందరూ షాక్లో ఉంటారని తెలుసు
మీలో చాలామంది ఇప్పుడు షాక్లో ఉంటారని తనకు తెలుసునని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ ఫ్యామిలీలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటూనే ఉంటామన్నారు. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సుశాన్ (యూట్యూబ్ సీఈవో), యూట్యూబ్ టీమ్కు మద్దతుగా ఉండాలన్నారు.