సర్కస్ లో గ్రేనేడ్ పేలుడు: 11 మందికి గాయాలు
లీమా: సర్కస్ ప్రదర్శన మైమరిచి తిలకిస్తున్న సమయంలో గ్రేనేడ్ పేలిపోయి పలువురికి తీవ్రగాయాలైనాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. సర్కస్ కు వెళ్లిన స్థానికులతో పాటు సిబ్బందికి గాయాలైనాయి.
పెరూలోని సన్ జయన్ డీ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకునింది. సర్కస్ చూడటానికి స్థానికులు చాల మంది వెళ్లారు. సర్కస్ ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలైనాయి. అనేక మందికి చెవులు దెబ్బతిన్నాయి. పూర్తిగా వినపడటం లేదని అంటున్నారు.
సర్కస్ లో ఎర్పాటు చేసిన చెక్కలు పగిలిపోయి అనేక మంది శరీరంలోకి దూసుకు వెళ్లాయి. సర్కస్ సిబ్బందితో పాటు జంతువులకు గాయాలైనాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
శక్తి వంతమైన గ్రేనేడ్ పేలిందని పోలీసులు చెప్పారు. ముందుగానే గ్రేనేడ్ అమర్చారా, మధ్యలో బయట నుండి విసిరివేశారా అని ఆరా తీస్తున్నారు. ఇది దోపిడి దొంగల పనే అని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని నెలల నుండి పెరూలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయివేటు స్కూళ్లు, భవన నిర్మాణ సంస్థలు, ట్యాక్సీ డ్రైవర్లను లక్షంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు అన్నారు. గత నాలుగు నెలల నుండి ఇప్పటి వరకు 1,667 దోపిడీల కేసులు నమోదు అయ్యాయని పెరూ పోలీసు అధికారులు తెలిపారు.