శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లు
కొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయంలో భద్రతాబలగాలకు అనుమానాస్పద ఇస్లాం మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో వీరంతా మృతి చెందారు.
శుక్రవారం సాయంత్రం ఇస్లాం మిలిటెంట్లు అంపారాలోని సైంతమరతు ప్రాంతంలో నక్కి ఉన్నారని తెలుసుకున్న శ్రీలంక భద్రతాదళాలు అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఆదివారం ఓ చర్చిలో పేలుళ్లు జరిగిన ప్రాంతానికి అతిసమీపంలో ఈ ప్రాంతం ఉ:ది. ఇక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడికి వెళ్లి చూడగా అందులో ముగ్గురు అనుమానిత ఆత్మాహుతి సభ్యులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఓ ఇంటిలో దాచి ఉంచిన మూడు బాంబులు పేలడంతో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు కాల్పులు జరిపారు.
భద్రతాదళాలు కాల్పులు జరపడంతో అందులోని మిలిటెంట్లు కూడా ఎదురుకాల్పులకు దిగినట్లు మిలటరీ అధికార ప్రతినిధి సుమిత్ ఆటపట్టు తెలిపారు. మృతి చెందిన మిలిటెంట్లు నేషనల్ తౌహీద్ జమాత్ సంస్థకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇక ఆదివారం జరిగిన పేలుళ్లకు పాల్పడింది ఈ సంస్థే అని ముందుగా శ్రీలంక అధికారులు అనుమానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న 140 మంది అనుమానితులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. వారికి అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధాలపై ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 76 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఈజిప్టు, సిరియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.