ఆస్ట్రేలియాలో ఇండియన్ రెస్టారెంట్పై వ్యక్తి కాల్పులు
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ ఇండియన్ రెస్టారెంటు పైన కాల్పులు జరిపారు. సిడ్నీ సమీపంలో ఉన్న ఇండియన్ ఈటర్ యాన్ అనే రెస్టారెంట్ పైన దుండగుడు ఈ కాల్పులకు తెకబడ్డాడు.
రెస్టారెంట్ రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపాడు. ఇటీవలి కాలంలో భారతీయులే లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి. నీలి రంగు దుస్తులు ధరించి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటన జరిగినప్పుడు రెస్టారెంటులో దాదాపు నలభై మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఈ సంఘటన రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అతను కాల్పులు జరిపి పారిపోయే సమయంలో విగ్రామ్ వీధి వద్ద ఓ మహిళను తోసుకుంటూ పారిపోయాడు. అతనిని ఆ మహిళ చూసి ఉంటుందని భావిస్తున్న పోలీసులు, ఆమె నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాల్పుల ఘటన సమయంలో 30 నుంచి 40 మంది వరకు స్టాఫ్, కస్టమర్లు ఉన్నారని పోలీసులు చెప్పారు.