ఈజిప్టు చర్చిలో ఉగ్రదాడి: 10 మంది మృతి.. ఐఎస్ పనేనా?
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని హెల్వాన్ ప్రాంతంలో ఉన్న ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది సహా 9 మంది మృతి చెందారు. కొంతమంది ఉగ్రవాదులు చర్చి ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, చర్చిని చుట్టుముట్టి ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోగా మరో ఉగ్రవాది పారిపోయినట్లు తెలుస్తోంది.
గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి శరీరానికి ఆయుధాలు ధరించి కనిపించినట్లు స్థానికులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు.
గతంలో ఈజిప్టులోని కొన్ని చర్చిలపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబుదాడులకు పాల్పడ్డారు. దీంతో ఈ దాడి కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే చేసి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు.