ఇరాక్ లో 26 మంది విదేశీయులు కిడ్నాప్
బాగ్దాద్: సాయుధులు 26 మంది విదేశీయులతో సహ 28 మందిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. విదేశీయులు కిడ్నాప్ కు గురైనారని ఇరాక్ అధికారులు స్పష్టం చేశారు. అయితే కిడ్నాప్ కు గురైన విదేశీయులు ఏ దేశాలకు చెందిన వారు అని ఇంకా వెలుగు చూడలేదు.
బాగ్దాద్ సమీపంలోని ముధానా ప్రావిన్స్ ప్రాంతంలో వేకువ జామున మూడు గంటల సమయంలో 26 మంది విదేశీ ఖతారి హంటింగ్ సభ్యులు ఉన్నారు. వీరికి రక్షణగా ఇద్దరు ఇరాక్ అధికారులు అక్కడే ఉన్నారు.
అదే సందర్బంలో అనేక ట్రక్కుల్లో అత్యాధునిక ఆయుధాలు చేతపట్టుకుని వెళ్లిన దుండగులు వీరిని కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. విదేశీయులతో పాటు ఇద్దరు ఇరాక్ అధికారులనూ ఎత్తుకెళ్లారు.
విషయం తెలుసుకున్న ఇరాక్ అధికారులు విదేశీయులను ఎక్కడ దాచి పెట్టారు అని గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ విదేశీయులను కిడ్నాప్ చేసింది ఎవరు అని కచ్చితంగా తెలియడం లేదని ఇరాక్ అధికారులు అంటున్నారు.
గత మూడు నెలల్లో విదేశీయులను కిడ్నాప్ చెయ్యడం ఇది రెండవ సారి అని ఇరాక్ అధికారులు చెప్పారు. హంటింగ్ చెయ్యడానికి వెళ్లిన విదేశీయులు కిడ్నాప్ కావడంతో ఇరాక్ ప్రభుత్వం తల పట్టుకునింది. అయితే విదేశీయులను కిడ్నాప్ చేసింది మేమే అంటూ ఏ ఉగ్రవాదులు ఇప్పటి వరకు ప్రకటించలేదు.