చర్యకు ప్రతి చర్య: హెచ్ 1 బీ వీసాపై ఆంక్షలు.. ట్రేడ్ పైనా పడతాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో సేవలందించేందుకు విదేశాల నుంచి వస్తున్న ఐటీ నిపుణుల వలసలను నిరోధించేందుకు ప్రత్యేకించి భారతీయ ఐటీ నిపుణుల రాకను అడ్డుకునేందుకు తాజాగా హెచ్ 1 బీ వీసాల జారీపై
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో సేవలందించేందుకు విదేశాల నుంచి వస్తున్న ఐటీ నిపుణుల వలసలను నిరోధించేందుకు ప్రత్యేకించి భారతీయ ఐటీ నిపుణుల రాకను అడ్డుకునేందుకు తాజాగా హెచ్ 1 బీ వీసాల జారీపై పరిమితితో కూడిన ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను సునిశితంగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని భారత్ తేల్చేసింది.
ట్రంప్ తీసుకున్న తాజా ఆదేశాలు ప్రత్యేకించి భారత ఐటీ పరిశ్రమలు, భారత ఐటీ నిపుణుల భవితవ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో చర్చిస్తామని భారత్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
భారత పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తమ దేశంలో పరిశ్రమలు స్థాపించిన పలు అమెరికా కంపెనీలు సాధిస్తున్న లాభాలతోపాటు వివిధాంశాలతో 'వీసా' అంశంపై చర్చ కలిసిపోయి ఉన్నదని పేర్కొన్నారు. అమెరికాతోపాటు పలు దేశాలు తీసుకుంటున్న రక్షణాత్మక విధానాలకు ప్రతీకారం తీసుకుంటామని నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు.
ప్రతిభావంతులకే అవకాశాలిలా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్.. హెచ్ 1 బీ వీసా జారీ కార్యక్రమాన్ని పటిష్ఠ పరుస్తుంది. అంతే కాదు విదేశీ నిపుణుల వలసలను నిరోధించేందుకు వీలు కల్పిస్తుంది. తాజా ట్రంప్ ఆదేశాల జారీతో అత్యంత నిపుణులను, అత్యధిక వేతనం పొందే వారికి అనుమతి ఇస్తున్నది. ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ విధానాన్ని ట్రంప్ సర్కార్ తాజాగా జారీ చేసిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రద్దు చేస్తూ ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తుంది.
వాణిజ్యం, సర్వీసుల అంశం
భారత విదేశాంగశాఖ అదికార ప్రతినిధి గోపాల్ బాగ్లాయ్ మాట్లాడుతూ వీసా డిబేట్ వాణిజ్యం, సర్వీసుల అంశమని, ఇది కేవలం ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన అంశం కాదని స్పష్టం చేశారు. వీసా జారీ ప్రక్రియలో అమెరికా మార్పు తీసుకొచ్చిన తర్వాత పరిణామాలను, ప్రభావాన్ని భారత్ పూర్తిగా అంచనా వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇందులో పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని, భారతదేశంలోని ఐటీ కంపెనీల్లోనూ భారీ స్థాయిలో అమెరికా నిపుణులు పని చేస్తున్నారని గోపాల్ బాగ్లాయ్ పేర్కొన్నారు.
ట్రంప్ ఆంక్షలపై నాస్కామ్ ఇలా
మెరిట్ పేరిట హెచ్ 1 బీ వీసాల జారీపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనూహ్య పరిణామాలకు దారి తీస్తుందని నాస్కామ్ హెచ్చరించింది. ప్రస్తుతం లాటరీ పద్దతిలో జారీ చేస్తున్న హెచ్ 1 బీ వీసాల విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు భారత ఐటీ దిగ్గజాలపై ట్రంప్ ఆదేశాల ప్రభావం ఉండదని కూడా నాస్కామ్ స్పష్టం చేసింది. వీసా నిబంధనల్లో మార్పు వల్ల నిర్వహణా వ్యయాలు పెరిగిపోయే అవకాశం ఉన్నదని తెలిపింది. ట్రంప్ ఆదేశాలను పాటించాల్సి వస్తే భారత కంపెనీలు అమెరికా పౌరులనే నియమించుకోవాలని, లేదంటే అధిక వేతనాలు చెల్లించి భారత టెక్కీలను నియమించుకోవడం గానీ, లేదా భారత దేశానికి తిరిగి రావడం కానీ చేయాల్సి ఉంటుందని మరో ఇండస్ట్రీ బాడీ అసోచాం వ్యాఖ్యానించింది.
దెబ్బకు దెబ్బ తప్పదని నిర్మలా సీతారామన్
భారత వాణిజ్య, పరిశ్రమలశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ‘అమెరికాలోనూ భారతీయ కంపెనీలు స్థాపించినట్లే.. భారతదేశంలోనూ అమెరికా కంపెనీలు కూడా స్థాపించాయి. అమెరికాలో భారత ఐటీ కంపెనీలు లాభాలు గడిస్తున్నట్లే.. భారతదేశంలోనూ అమెరికా కంపెనీలు లాభాలు పొందుతున్నాయని గుర్తుచేస్తున్నారు' అని పేర్కొన్నారు. అమెరికాలో భారత కంపెనీలు ట్రంప్ ఆదేశాలతో తీవ్ర ప్రభావాన్ని పొందుతుండగా, ఏళ్ల తరబడి భారతదేశంలోనూ పని చేస్తున్నఅమెరికా కంపెనీల బిజినెస్పై ప్రభావం ఉంటుందని ఆమె చెప్పారు.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో జైట్లీ చర్చిస్తారు
హెచ్ 1 బీ వీసాల జారీపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ జారీచేసిన ఆదేశాలపై అమెరికా ప్రభుత్వంతో భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చర్చిస్తారని భారత వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ప్రకారం అమెరికా తప్పనిసరిగా నిర్దిష్ట వీసాలు జారీ చేయాల్సి ఉంటుందని, డబ్ల్యూటీవోకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనన్నారు. కేవలం అమెరికా మాత్రమే కాదు పలు దేశాలు ఇదే తరహాలో ఆంక్షలు విధిస్తున్నతీరుపైనా స్పందిస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా తాత్కాలిక వీసా ‘457 వీసా' రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తామన్నారు. సేవా పరమైన వాణిజ్య రంగంలో పలు దేశాలు రక్షణాత్మక వైఖరి అనుసరించడం సరి కాదన్నారు.