భారత టెక్కీలకు కష్టకాలమే: హెచ్1బీ వీసా మరింత కఠినతరం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి విదేశీ విధానాలపై సంస్కరణలు జరుగుతూనే ఉన్నాయి. వీసా నిబంధనల్లోనూ మార్పులు చేసుకుంటున్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన ప్రతిపాదనతో అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారత ఐటీ ఉద్యోగులకు కష్టకాలమే అని చెప్పాలి.
హెచ్-1బీ వీసా జారీ విధానాన్ని కఠినతరం చేసేందుకు అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది. హెచ్-1బీ వీసా పిటిషన్దారుల ఎంపిక ప్రక్రియలో కఠిన నిబంధనలను చేర్చినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ సంస్థ ఫ్రాగోమెన్ స్పష్టం చేసింది.
ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి..
ఫ్రాగోమెన్ సమాచారం ప్రకారం.. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హెచ్-1బీ వీసా నిబంధనలపై 2011లో చేసిన ప్రతిపాదనను తాజాగా మరోసారి పునరుద్ధరించనుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం ప్రకారం.. హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకునే పిటిషన్దారులు ముందుగా హెచ్-1బీ క్యాప్ లాటరీ కోసం రిజిస్టర్ చేసుకోవాలి.
ఎక్కువ నైపుణ్యం ఉన్నవారికే
క్యాప్ నంబర్లు వచ్చిన తర్వాతే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నంబర్లను ఇవ్వడంలో ప్రాధాన్యత పద్ధతిని పాటించాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదిస్తోంది. అంటే ఎక్కువ నైపుణ్యాలు కలిగిన వారికి, ఎక్కువ జీతం వచ్చే వారికి ఈ క్యాప్ నంబర్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వేతనాల్లోనూ మార్పులు
సెమి ఆన్యువల్ రెగ్యులేటరీ ఎజెండాలో భాగంగా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ ప్రతిపాదనలు చేసింది. అంతేగాక.. హెచ్-1బీ ఉద్యోగుల వేతనాల్లోనూ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వీసాల జారీపై అమెరికా పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇటీవలే హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భారత్, చైనా టెక్కీలకు కష్టకాలమే
తాజాగా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రతిపాదన వీసా పిటిషన్దారులకు మరింత నిరాశను కలిగిస్తోంది. అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేయాలంటే హెచ్-1బీ వీసా తప్పనిసరి. ఎక్కువగా భారత్, చైనా దేశాల నుంచి ఈ వీసా కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే అమెరికా నిబంధనలు కఠినతరం చేయడం గమనార్హం.