H-1B వీసాలు: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న అమెరికా
వాషింగ్టన్: 2021 సీజన్కు గాను హెచ్-1 బీ వీసా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముగింపు పలికింది అమెరికా. ఇక అమెరికాకు వెళ్లాలని భావించి హెచ్-1బీ వీసా కావాలనుకునే ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లే విదేశీయులకు ఆదేశం హెచ్-1బీ వీసాను జారీ చేస్తుంది. ముఖ్యంగా టెక్నికల్ రంగానికి చెందిన వారు హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళుతుంటారు. ఇక అమెరికాలోని ఐటీ సంస్థల్లో అత్యధికంగా భారతీయులే పనిచేస్తుండటం విశేషం.
హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విదేశీయులు 2021 సీజన్కు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ పేర్కొంది. ఇందుకోసం ముందుగా 10 అమెరికా డాలర్లను ఫీజుకింద చెల్లించాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల పేపర్ పని తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు దరఖాస్తుదారులకు కూడా డబ్బులు ఆదా అవుతుందని ఏజెన్సీ వెల్లడించింది. ఇక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కేవలం కంపెనీ దరఖాస్తుదారుడికి సంబంధించిన ప్రాథమిక సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది.
ముందుగా వచ్చే ఏడాది మార్చి 1 నుంచి మార్చి 20 వరకు రిజిస్ట్రేషన్ పిరియడ్ ఉంటుందని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇందులో కొన్ని దరఖాస్తులు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని వారు మాత్రమే హెచ్-1బీ వీసా కోసం పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ స్పష్టం చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సత్ఫలితాన్ని ఇచ్చిందని ఇకపై దీన్ని పూర్తస్థాయిలో అమలు చేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ను వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే ఏడాదికి 65వేల వీసాలు మాత్రమే ప్రాసెస్ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే అమెరికాలో మాస్టర్ డిగ్రీ లేదా పీజీ చేసిన వారికి సంబంధించి తొలి 20వేల దరఖాస్తులకు ఈ 65 వేల వీసాల నుంచి మినహాయింపు ఉంటుంది.