వీసా నిబంధనలు మన మంచికేనట! భారీగా వేతనాలు పెరుగుతాయట!!
హెచ్-1బీ వీసా నిబంధలను కఠినతరం చేయడం భారత ఐటీ నిపుణులకు మేలు జరుగుతుందని, అత్యధిక వేతనాలు అందుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసా నిబంధలను కఠినతరం చేయడంపై అమెరికన్ నిపుణులు కొత్త భాష్యం చెబుతున్నారు. దీనివల్ల భారత ఐటీ నిపుణులకు మేలు జరుగుతుందని, అత్యధిక వేతనాలు అందుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఎంతో కీలకమైన హెచ్-1బీ వీసా విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు అధికారిక ఉత్తర్వును కూడా జారీ చేశారు.
అయితే, వీసా సంస్కరణల వల్ల అటు టెక్నాలజీ సంస్థలతో పాటు ఇటు అవుట్సోర్సింగ్ సేవలు అందించే కంపెనీల్లో శ్రామిక ఖర్చు మరింత పెరుగుతుందని బన్యాన్ ట్రీ కేపిటల్ మేనేజిమెంట్ వ్యవస్థాపకుడు, నిర్వహణ భాగస్వామి అయిన ఇగ్నాటియస్ చిథెలెన్ పేర్కొన్నారు.
'వీసా సంస్కరణలు అమలైతే ఏడాదికి 2.6బిలియన్ డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రధాన కంపెనీల్లో హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగికి సగటున లక్ష డాలర్ల దాకా వార్షిక వేతనం ఇవ్వాల్సి వస్తుంది. అయితే కంపెనీలిచ్చే వీసా సంఖ్యను మ్రాతం పెంచబోవని' చిథెలెన్ అన్నారు.
కొత్త వీసా సంస్కరణలు ఈ ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి దరఖాస్తుదారులందరూ అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యాలు కలిగిన వారే ఉంటారు. అదే సమయంలో ఉద్యోగాల నియామకాల్లో అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడం దృష్ట్యా హెచ్-1బీ వీసాల జారీ కూడా తగ్గే అవకాశం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ఉద్దేశ్యం అమెరికా ఫస్ట్ అనేది కాదని, సిస్టమ్ లో ఉన్న దుర్వినియోగాన్ని అరికడుతుందని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు దేవ్ బ్రాట్ తెలిపారు. కంపెనీలు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో లొసుగులను అడ్డం పెట్టుకుని, అత్యంత నిపుణులైన అమెరికా వర్కర్లను చీఫ్ లేబర్ తో రిప్లేస్ చేస్తున్నారని బ్రాట్ మరోసారి ఉద్ఘాటించారు. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో మార్పులను ప్రతిపాదించిన వారిలో ఈయన ఒకరు.