ఉబెర్కు షాక్: 57మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటా హ్యాక్, లక్ష డాలర్ల చెల్లింపు!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ దిగ్గజ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్కు హ్యాకింగ్ షాక్ తగిలింది. సంస్థకు చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించినట్లు ఉబర్ సంస్థ వెల్లడించింది. ఏడాది పాటు హ్యాక్ చేసి ఈ డేటాను తీసుకున్నట్లు తెలిసింది.
ఇలా జరిగుండాల్సింది కాదు..
కాగా, హ్యాకింగ్ విషయాన్ని ఉబర్ సంస్థ సీఈవో డారా ఖోస్రోషాహి కూడా ధ్రువీకరించారు. ఇలా జరగకుండా ఉండాల్సింది కాదని, దీన్ని తాము సహించబోమని డారా అన్నారు.
అన్ని వివరాలు దొంగిలించారు..
సంస్థ క్లౌడ్ సర్వర్ను హ్యాక్ చేసి డేటాను దొంగలించినట్లు డారా తెలిపారు. హ్యాక్ అయిన డేటాలో రైడర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్ల వివరాలు ఉన్నట్లు ఉబర్ పేర్కొంది.
ఆయనకు తెలుసు కానీ
అయితే, హ్యాకింగ్ గురించి కొన్ని రోజుల క్రితమే మాజీ సీఈవో, ఉబర్ సహా వ్యవస్థాపకుడు ట్రావిక్ కలోనిక్కు తెలిసిందట. కానీ, సీఈవో అధికారికంగా ప్రకటించేవరకు విషయాన్ని బహిర్గతం చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. హ్యాకర్లతో ఉబర్ చర్చలు కూడా జరిపిందట.
హ్యాకర్లకు లక్ష డార్ల చెల్లింపు?
దొంగలించిన రైడర్లు, డ్రైవర్ల సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ఉబర్ సదరు హ్యాకర్లకు 1,00,000 డాలర్లు చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం సమాచారమంతా సురక్షితంగా ఉందని సంస్థ సీఈవో డారా స్పష్టం చేశారు. ఇకపై డ్రైవర్లు, రైడర్ల డేటాకు మరింత భద్రత అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఉబర్కు .. ఈ హ్యాకింగ్ మరో తలనొప్పిగా మారింది.