‘‘55 కోట్ల ఐఫోన్ల డేటా.. మా గుప్పిట్లో’’.. ఆపిల్ కంపెనీని బ్లాక్ మెయిల్ చేస్తున్న హ్యాకర్లు
తాజాగా మిలియన్ల కొద్దీ ఐఫోన్ల డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ ఐఫోన్ అకౌంట్ల ఫొటోలు, వీడియోలు, మెసేజ్ లు అన్నీ హ్యాకర్ల గుప్పిట్లో ఉన్నట్లు సమాచారం.
న్యూయార్క్: హ్యాకర్ల బారిన పడకుండా ఎంతో సురక్షితమైన ఫోన్ గా ఐఫోన్ కు పేరుంది. అందుకే ఆపిల్ ఐఓఎస్ సిస్టం అంత పాపులారిటీ చూరగొంది. కానీ ఇప్పుడు ఐఫోన్లు కూడా హ్యాకర్ల బారిన పడినట్లు తెలుస్తోంది.
తాజాగా మిలియన్ల కొద్దీ ఐఫోన్ల డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయిందంట. ఆ ఐఫోన్ అకౌంట్ల ఫొటోలు, వీడియోలు, మెసేజ్ లు అన్నీ హ్యాకర్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారట. 'టర్కిస్ క్రైమ్ ఫ్యామిలీ' అనే హ్యాకర్ల గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
ఐక్లౌడ్, ఇతర ఆపిల్ ఈ-మెయిల్ అకౌంట్ల డేటా తొలగించాలంటే తమకు 75 వేల డాలర్లను బిట్ కాయిన్ లేదా ఇథేరియన్ రూపంలో ఇవ్వాలని.. లేదంటే లక్ష డాలర్ల విలువైన ఐట్యూన్స్ గిఫ్ట్ కార్డులను తమకు ఇవ్వాల్సి ఉంటుందని ఆ హ్యాకర్ల గ్రూప్ ఆపిల్ కంపెనీని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది.
కానీ ఆపిల్ కంపెనీ మాత్రం అసలు ఎలాంటి హ్యాకింగ్ జరగలేదంటూ తోసిపుచ్చింది. ఐక్లౌడ్, ఆపిల్ ఐడీలకు సంబంధించి ఎలాంటి ఆపిల్ సిస్టమ్స్ చోరీకి గురికాలేదని తేల్చి చెబుతోంది.
అయితే హ్యాకర్లు చెబుతున్నది మరో రకంగా ఉంది. దాదాపు 559 మిలియన్లు.. అంటే 55 కోట్లకు పైగా ఆపిల్ ఈ-మెయిల్, ఐక్లౌడ్ అకౌంటర్లను హ్యాక్ చేసినట్లు వారు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఆపిల్ సెక్యూరిటీ టీమ్ కు కూడా వారు పంపిస్తున్నారు.