అడుగు ముందుకు పడింది: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ పై కేసు నమోదు చేసిన పాక్
పాకిస్తాన్: 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్పై పాకిస్తాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణలపై హఫీజ్ సయీద్తో పాటు మరో 12 మంది పై 23 కేసులు నమోదు చేసింది. ఉగ్రవాదంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ముందుగా హఫీజ్ సయీద్ పై కేసులు నమోదు చేసింది. మొత్తం 23 కేసులను నమోదు చేసినట్లు పాక్ కౌంటర్ టెరరిజం శాఖ స్పష్టం చేసింది.
హఫీజ్ సయీద్ తన అనుచరులు 12 మంది ట్రస్టు పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసహాయం చేస్తున్నారని తమ విచారణలో తేలినందున వారిపై కేసులు నమోదు చేసినట్లు కౌంటర్ టెరరిజం డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇప్పటికే హఫీజ్ సయీద్ నేతృత్వంలో నడుస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జమా-ఉద్-దవా పై రెండు సార్లు దాడులు చేసింది పంజాబ్ ప్రావిన్స్లోని కౌంటర్ టెరరిజమ్ శాఖ. యాంటీ టెర్రరిజమ్ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. ఇక కేసులు నమోదైన చారిటీ సంస్థలు ఇలా ఉన్నాయి. 1) దవాత్ ఇర్షాద్ ట్రస్టు 2) మోజ్ బిన్ జబల్ ట్రస్టు 3) అల్-అన్ఫాల్ ట్రస్టు 4)అల్ మదీనా ఫౌండేషన్ ట్రస్టు 5) అల్ హమ్ద్ ట్రస్టులు ఉన్నాయి.
ఇక ఈ చారిటీ సంస్థలు ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కౌంటర్ టెరరిజం శాఖ పేర్కొంది. ఇందులో లాహోర్, గుర్జన్వాలా, ముల్తాన్ నగరాలు ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ సంస్థల్లో పనిచేస్తున్న హఫీజ్ సయీద్, హఫీజ్ సోదరుడు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ,అమీర్ హమ్జా, మొహమ్మద్ యాహ్యా అజీజ్లపై కేసులు నమోదు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం, ఉగ్రదాడుల కోసం వీరు నిధులు సమీకరించారని కౌంటర్ టెరరిజం శాఖ స్పష్టం చేసింది. ట్రస్టుల పేరుతో వీరు సంఘవిద్రోహక చర్యలకు పాల్పడుతున్నారని, ఉగ్రవాదంను ప్రమోట్ చేస్తున్నారని వెల్లడించింది.
పాకిస్తాన్లోని పలు సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ఐక్యరాజ్యసమితి గుర్తించి వాటిని బ్లాక్లిస్టులో చేర్చిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం వీటిపై కేసులు నమోదు చేయడం విశేషం.2008లో హఫీజ్ సయీద్ ముంబై దాడులకు స్కెచ్ వేశాడు. అతని ప్రాణాలతో కానీ, మృతదేహాన్ని కానీ అప్పగిస్తే 10 మిలియన్ డాలర్లను అమెరికా బహుమతిగా ప్రకటించింది.