30 మంది భారత సైనికులను చంపేశాం: సయీద్
తాము జరిపిన సర్జికల్ దాడుల్లో 30 మంది భారత సైనికులు మరణించినట్లు జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రకటించుకున్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ జరిపిన మెరుపుదాడులకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపామని ఆయన
న్యూఢిల్లీ: తాము జరిపిన సర్జికల్ దాడుల్లో 30 మంది భారత సైనికులు మరణించినట్లు జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రకటించుకున్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ జరిపిన మెరుపుదాడులకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపామని ఆయన చెప్పాడు. సయీద్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. పాక్ నుంచి ఎటువంటి సర్జికల్ దాడులు జరగలేదని, సైనికులు ఎవరూ మృతి చెందలేదని కొట్టిపడేసింది. అయితే పాక్ దాడుల్లో ముగ్గురు కార్మికులు మాత్రం మృతి చెందారని తెలిపింది.
పాకిస్థాన్లోని ముజఫరాబాద్లో బుధవారం హఫీజ్ ఓ సభ నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ ఒకటి వెలుగు చూసింది. అందులో ఆయన మాట్లాడుతూ భారత్ చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్ అంతా బూటకమని, సోమవారం మన యువకులు నలుగురు అఖ్నూర్ ఆర్మీ క్యాంపుపై దాడి చేసి 30 మంది భారత సైనికులను హతమార్చారని అందులో చెప్పాడు. ఆ తర్వాత క్యాంపును తగలబెట్టి సురక్షితంగా తిరిగి వచ్చారని వివరించాడు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఇదని అన్నాడు.
హఫీజ్ వీడియోపై భారత సైన్యం స్పందించింది. సోమవారం ఆర్మీ క్యాంపుపై ఎటువంటి దాడి జరగలేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జనరల్ రిజర్వు ఇంజినీరింగ్ ఫోర్స్(జీఆర్ఈఎఫ్) క్యాంప్ సమీపంలో ఉగ్రదాడి జరిగిందని వివరించింది. ఈ దాడిలో ముగ్గురు కార్మికులు మృతి చెందారని ఆర్మీ అధికారి తెలిపారు.
దాడి జరిగిన సమయంలో పదిమంది కార్మికులు, మరో పదిమంది జీఆర్ఈఎఫ్ సిబ్బంది ఉన్నారని చెప్పారు. 2008లో ముంబైలో జరిగిన బాంబు దాడుల కేసులో హఫీజ్ సయీద్ ప్రధాన నిందితుడు. ఆ దాడిలో 166 మంది మృతి చెందారు.