షాకింగ్ వీడియో: దావూద్ ఇబ్రహీంను పొగుడుతూ సయిద్ కొడుకు
ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ప్రభుత్వం అండదండలున్నాయని మరోసారి రుజువయింది. జమాత్-ఉల్-దవా (జేయూడీ) చీఫ్ మిలిటెంట్ హఫీజ్ సయీద్ కొడుకు తల్హాకి సంబంధించిన
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ప్రభుత్వం అండదండలున్నాయని మరోసారి రుజువయింది. జమాత్-ఉల్-దవా (జేయూడీ) చీఫ్ మిలిటెంట్ హఫీజ్ సయీద్ కొడుకు తల్హాకి సంబంధించిన వీడియో ఒకటి సంచలంగా మారింది.
ఫిబ్రవరి 5న పాకిస్తాన్లో నిర్వహించిన కాశ్మీర్ డే సందర్భంగా జరిగిన ఓ బహిరంగ సభలో తల్హా.. దావూద్ ఇబ్రహీం పేరును ప్రస్తావించినట్టు వెలుగు చూసింది. దావూద్ పేరును ఉపయోగిస్తూ భారత్పై యుద్ధం చేయాలని స్థానిక జనాలను రెచ్చగొట్టే నినాదాలు చేయించినట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది.
మీరు న్యాయమూర్తుల, పోలీసులు, డాక్టర్లు అవుతారా.. అని తల్హా అడగగా, స్థానికులు అందరూ లేదు అని చెప్పడం వినిపిస్తుంది. మళ్లీ అతను.. మీరంతా దావూద్లా అవుదామనుకుంటున్నారా... అని అడగగా, వారు అందరూ అవును అని నినాదాలు చేశారు.
అంతేకాదు, గతేడాది కాశ్మీర్లో ఆర్మీ ఎన్కౌంటర్లో మరణించిన బుర్హాన్ వానీ పేరు కూడా ప్రస్తావించాడు. అతడిలాగా మారతామని వారితో నినాదాలు చేయించాడు. ప్రస్తుతం భారత నిఘా వర్గాలు ఈ వీడియో నిజమైందా కాదా అన్న దానిపై ఆరా తీస్తున్నాయి. డీ కంపెనీ (దావూద్ ముఠా), జేయూడీ కలిసి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయా అన్న దానిపైనా విచారణ జరుపుతున్నాయి.