దిమ్మ తిరిగేలా విసా ఛార్జీలు పెంచిన సౌదీ: హజ్ యాత్రను బాయ్ కాట్ చేసిన ముస్లిం దేశాలు
దుబాయ్: ధనిక దేశాల్లో ఒకటిగా పేరున్న సౌదీ అరేబియా.. విసా ఛార్జీలను భారీగా పెంచింది. ఎంత భారీగా అంటే.. ఇప్పటిదాకా ఉన్న విసా ఛార్జీల మొత్తాన్ని ఆరు రెట్లకు పెంచింది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం సౌదీ అరేబియాకు వెళ్లే వారు ఇకపై తమ చేతి చమురును వదిలించుకోక తప్పదు. వారి సంగతి పక్కన పెడితే.. పవిత్ర హజ్, ఉమ్రా యాత్రకు వెళ్లే మధ్య తరగతి కుటుంబీకులకు ఈ విసా ఛార్జీల పెంపుదల పెను భారంగా మారుతుందనడంలో సందేహాలు అనవసరం.
కంటైనర్ లో 39 మృతదేహాలు..కుళ్లిపోయిన స్థితిలో: పోలీసుల అదుపులో డ్రైవర్
సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ, ఆరునెలల విసా, ఏడాది విసా ఛార్జీలు కళ్లు బైర్లు కమ్మే స్థాయికి చేరుకున్నాయి. నిన్న, మొన్నటి దాకా సౌదీ అరేబియా సింగిల్ ఎంట్రీ 93 డాలర్లు మాత్రమే. మన దేశీయ కరెన్సీతో పోల్చుకుంటే సుమారు ఏడు వేల రూపాయలు. ఇప్పుడీ సింగిల్ ఎంట్రీ విసా ఛార్జీలు 533 డాలర్లకు పెరిగాయి. అంటే- దాదాపుగా 38 వేల రూపాయలు. మల్టిపుల్ ఎంట్రీ, ఆరు నెలల విసా ఛార్జీలు పొందాలంటే 800 అమెరికన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. సుమారు 58 వేల రూపాయలన్నమాట. 58 వేల రూపాయలను చెల్లించి విసా తీసుకుంటే.. ఆరు నెలల పాటు మాత్రమే వర్తిస్తుంది.
ఇక 12 నెలల విసా కోసం దాదాపుగా 95 వేల రూపాయలను ఛార్జీల రూపంలో వసూలు చేస్తుంది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఇంత భారీ స్థాయిలో విసా ఛార్జీలను పెంచడానికి పెద్దగా కారణాలేమీ లేవు గానీ.. విసా ఛార్జీల మొత్తాన్ని సమీక్షిస్తామని కొద్దిరోజుల కిందటే చేసిన ప్రకటనకు అనుగుణంగా.. వాటి రేట్లను పెంచారు. ఒక్క హజ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసమే కాకుండా.. సౌదీ అరేబియాకు వెళ్లే ప్రతి బయటి దేశస్తుడికి విసాలను మంజూరు చేయడానికి ఆయా మొత్తాన్ని వసూలు చేస్తుంది ప్రభుత్వం. హజ్ యాత్రకు మినహాయింపేమీ ఇవ్వలేదు.
తొలిసారి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ఈ పెంపుదల వర్తించదని సౌదీ అరేబియా ప్రభుత్వం వెల్లడించింది. సౌదీ అరేబియా ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన సిఫారసుల మేరకే తాము విసా ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ పెంపుదలను పలు ముస్లిం దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం జనాభా అధికంగా ఉండే మొరాకో హజ్ యాత్రను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకుంది. భారీగా పెంచిన విసా ఛార్జీలను తగ్గించేంత వరకూ తాము హజ్ యాత్రను బాయ్ కాట్ చేస్తామని వెల్లడించింది. టర్కీ, ఈజిప్టు, నైజీరియా వంటి దేశాలు సైతం అదే బాటలో నడుస్తున్నాయి.