లఖ్వీని భారత్కు అప్పగించండి: పాక్కు అమెరికా హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలను అణచివేయడంలో పాకిస్థాన్ అలక్ష్యం ప్రదర్శిస్తోందని అమెరికా విదేశీ వ్యపహారాల స్థాయి సంఘం కమిటీ చైర్మన్ ఎడ్ రోసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముంబైపై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని భారత్కు అప్పంగించడం లేదా అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ప్రాంతానికి ఉగ్రవాదం నుంచి పెను ముప్పు పొంచివుందని ఆయన హెచ్చరించారు. గల్ఫ్ రాష్ట్రాలకు చెందిన పలు కుటుంబాల నుంచి పాకిస్థాన్లోని డియోబంది పాఠశాలకు విరాళాలు అందుతున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఐఎస్ఐ తీరుపై రోసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
26/11 ఉగ్రదాడిలో లష్కరె తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నా దోషులను అప్పగించే విషయంలో పాకిస్థాన్ ఎలాంటి చొరవతీసుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సూత్రధారినే స్వేచ్ఛగా వదిలిపెట్టడం దారుణమని లఖ్వీని ఉద్దేశించి రోసీ వ్యాఖ్యానించారు.
2008 నవంబర్లో జరిగిన ముంబై మారణకాండలో లఖ్వీ సహా ఆరుగురిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాడికి పురిగొల్పారని భారత్ సాక్ష్యాలను సేకరించింది. 26/11 దాడిలో 166 మంది మృతి చెందారు. సీమాంతర ఉగ్రవాదం సహా పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో రోసీ చర్చలు జరిపారు.