ముషారఫ్, శవాన్ని కూడ వదలద్దు... మూడు రోజులు పార్లమెంట్ ముందు చౌరస్తాలో వేలాడదీయండి.... !
పాకిస్తాన్ చరిత్రలో ఏ నాయకుడికి విధించని శిక్షను పాక్ మాజీ ప్రధాని , ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్కు ఆదేశ ప్రత్యేక కోర్టు విధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... రాజద్రోహం కేసులో ప్రత్యేకంగా ఏర్పాటైన పెషావర్ కోర్టు రెండు రోజుల క్రితం మరణశిక్షను విధించి... సంచలన తీర్పు ఇవ్వడమే కాకుండా అత్యంత కఠిమమైన నిర్ణయాన్ని కూడ వెలువరించింది. ఉరికి ముందు చనిపోయినా...శవాన్ని కూడ వదలవద్దంటూ... తీర్పు వెలువరించింది.
ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్ హీరో, మాజీ అధ్యక్షుడు ముషారఫ్ సంచలనం, వీడియో వైరల్
శవాన్ని మూడు రోజులు వేలాడదీయండి
ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం మొత్తం 167 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది. ముఖ్యంగా ఈ కేసులో ముషారఫ్ను చనిపోయినా కూడ వదల వద్దంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈనేపథ్యంలోనే అనారోగ్యంతో ఉన్న ముషారఫ్ ఒకవేళ చనిపోతే ఏం చేయాలన్న ప్రశ్నలకు కూడ తీవ్రమైన తీర్పును వెలువరించింది. ఆయన తీర్పు అమలుకు ముందే చనిపోతే... ముషారఫ్ శవాన్ని ఇస్లామాద్లోని డీ చౌక్ చౌరస్తాలో మూడు రోజుల పాటు వేలాడదీయాలని తీర్పు వెలువరించింది.
కక్షతోనే తీర్పు ముషారఫ్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్కు మరణశిక్ష విధిస్తూ పాకిస్తాన్లోని ఓ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే తీర్పుకు సంబంధించి నేడు ముషారఫ్ స్పందించారు. కేసులో ప్రతివాదికి అంటే తన వాదనలు వినకుండా ఏకపక్షంగా తీర్పును ఇవ్వడం గత చరిత్రలో ఎప్పుడు లేదని ముషారఫ్ అన్నారు. రాజ్యంగపరంగా అయితే ఈ కేసును వినాల్సిన అవసరం కూడ లేదని చెప్పారు. కాని వ్యక్తిగత కక్ష్యలను మనసులో పెట్టుకుని కొంతమంది ఈ కేసును తీసుకుని తనను టార్గెట్ చేస్తూ.. విచారణ జరిపారని చెప్పారు.
కేసు ఎందుకు
2013లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) ప్రభుత్వం ముషారఫ్పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. 2007 నవంబర్ 3న రాజ్యాంగాన్ని రద్దుచేసి ,ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. దీంతో పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును విచారించి తీర్పును వెలువరించింది. కాగా డిసెంబర్ 17 నాటికి ఇరు వైపులా వాదనలు పూర్తైనా, కాకపోయినా తుది తీర్పు వెలువరిస్తామని ప్రత్యేక కోర్టు ఇంతకు ముందే స్పష్టం చేసింది. దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న ముషారఫ్ ను 2014 లో అభిశంసించారు. అప్పటి నుండి ఆయన 2016 నుంచి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్కు తిరిగి వచ్చిన ముషారఫ్కు ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి దుబాయ్ వెళ్లారు.
ముషారఫ్కు మద్దతుగా సైనికులు
ఇక ముషారఫ్పై కోర్టు ఉరిశిక్ష విధించడంతో దేశంలో ఆయన మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ముషారఫ్కు మద్దతుగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, నిలబడుతోంది. దీంతో కేసు విషయమై తన లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేసులో న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మరణశిక్ష ప్రకటన తర్వాత దేశంలో ఉన్న తాజా పరిస్థితులపై దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన సలహాదారులతో సమావేశం అయ్యారు.