ఆ రాత్రి అతన్ని భయభ్రాంతులకు గురిచేసిన 'పంది'..
ఒహియో : రాత్రిపూట రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని 'పంది' వెంబడించింది. అతని వెనకాలె నడుస్తూ.. అతను ఆగిన చోట ఆగుతూ.. అతను ఎటు వెళ్తే అటు వెళ్లింది. దీంతో సదరు వ్యక్తికి లోలోపల టెన్షన్ మొదలైంది. అసలా పంది తనను ఎందుకు వెంబడిస్తుందో అర్థం కాక.. ఎక్కడ తనపై దాడి చేస్తుందోనన్న భయంతో.. చివరకు పోలీసులకు ఫోన్ చేశాడు.
అమెరికాలోని ఒహియో పరిధిలో ఉన్న ఆంత్రక్ స్టేషన్ సమీపంలో ర్యాన్ సింగ్లే అనే వ్యక్తికి ఈ చేదు అనుభవం ఎదురైంది. సదరు వ్యక్తి ఫిర్యాదు విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. 'ఏంటీ.. పంది వెంబడిస్తుందా?' అని ఒకటికి రెండుసార్లు ఆరా తీశారు. అవును అని అతను ఖరాఖండిగా చెప్పడంతో.. ఇక చేసేది లేక ఓ పోలీస్ అధికారిని అక్కడికి పంపిస్తున్నట్టు చెప్పారు.
నిజానికి ఎవరో తాగుబోతు రాత్రిపూట ఫోన్ చేసి నస పెడుతున్నాడని పోలీసులు భావించారు. కానీ అక్కడికెళ్లి చూశాక కానీ వారికి అతని పరిస్థితి అర్థం కాలేదు. ఆ పందిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాకనే తమకు ఫోన్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ర్యాన్ సింగ్లే మాట్లాడుతూ.. అది నాకు చాలా దగ్గరగా వచ్చింది. నా పక్కనే నా కాళ్లను తాకుతూ నడిచింది. అంతేకాదు నా కాళ్ల మీద నుంచి నాపైకి ఎక్కేందుకు ప్రయత్నించింది' అని చెప్పాడు. అయితే తాను భావించినట్టుగా కాకుండా.. ఆ పంది చాలా సున్నిత స్వభావం కలిగి ఉన్నదని, సో స్వీట్.. అంటూ దాని గురించి అతను చెప్పడం గమనార్హం.
దీనిపై స్పందించిన నార్త్ రిడ్జివిల్లే పోలీసులు.. అది ఎవరో పెంచుకుంటున్న పంది అని తెలిపారు. మలవిసర్జన కోసం బయటకొచ్చిన ఆ పంది ఆ తర్వాత ర్యాన్ వెంటపడిందని చెప్పారు. 30-35పౌండ్స్ ఉండే ఆ పందిని తిరిగి దాని యజమానికి అప్పగించినట్టు పేర్కొన్నారు.