మందుబాబులకు సర్వే హెచ్చరిక: ఒక్క పెగ్గే కదా అని తాగితే మటాషే.. !
రోజుకు ఒక పెగ్గు మందు వేస్తే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్పారు... అందుకే ఒకటికంటే ఎక్కువగా తాగడం లేదు... వాడు పీపాలు పీపాలు తాగేస్తుంటాడు.. వాడు తొందరలోనే టపా కట్టేయడం గ్యారెంటీ అని చెప్పే వాళ్లకు ఇదొక షాకింగ్ వార్తే అవుతుంది. పీపాలు పీపాలు తాగే వారికే కాదు.. రోజుకు ఒకపెగ్గు లేదా రెండు పెగ్గులు తీసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారి పరిశోదనల్లో కూడా తేలింది ఇదే.
1990 నుంచి 2016 మధ్య మొత్తం 195 దేశాలనుంచి మద్యం సేవిస్తున్నవారి సమాచారం సేకరించి పరిశోదనలు చేశారు. 23 రకాల ఆరోగ్య సమస్యలపై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందామని ఈ పరిశోధనలు చేశారు. అయితే ఆరోగ్య సమస్యలను మద్యం మరింత జటిలం చేస్తుందనే అంచనాకు పరిశోధకులు వచ్చారు. మద్యం సేవించడం కాస్త ఎక్కవైతే... ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని తేల్చారు. అందుకే మద్యం కొంచెం కూడా తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ఇమ్మానుయేలా గకిడౌ చెబుతున్నారు. రోజుకు ఒక పెగ్గు లేదా రెండు పెగ్గుల అలవాటు నుంచి మద్యం సేవించేవారు బయటపడాలని ఆయన చెబుతున్నారు.
2016లో దాదాపు 2.8 మిలియన్ల మంది ఆల్కహాల్ సేవించడంతోనే మృతి చెందినట్లు పరిశోధకులు చెబుతున్నారు. 1990లో కూడా మద్యం కారణంగానే 2 మిలియన్లు మంది చనిపోయినట్లు వివరించారు.ఇక 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల లోపు ఉన్నవారు చాలామందికి ఆరోగ్య సమస్యలు కేవలం మద్యం సేవించడం మూలంగానే వస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. రోజుకు ఒక పెగ్గు మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనేది కేవలం భ్రమ మాత్రమేనని పరిశోధకులు తేల్చారు. 1990వ దశకంలో ఫ్రెంచ్ పత్రిక తన పత్రికలో రాయడం వల్లనే ప్రజలు ఇది నిజమని భావించినట్లు పరిశోధకులు తెలిపారు.
రోజు ఒక పెగ్గు లేదా రెండు పెగ్గులు తీసుకుంటున్నవారిలో కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తమ పరిశోధనల ద్వారా వెల్లడైందని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఇందులో గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉన్నట్లు వారు తెలిపారు. మహిళల్లో డయాబెటిస్ రేటు పడిపోయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ప్రతిరోజు కొంచెం మద్యం సేవిస్తున్న వారిలో బ్రెస్ట్ క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్లు, సిర్రోసిస్, క్షయ వ్యాధులతో పాటు... మద్యం మత్తులో జరిగే హింసలు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడం జరుగుతున్నాయని నివేదిక తెలిపింది.
ఇక అత్యధికంగా పురుషులు మద్యం సేవిస్తున్న దేశాలు చూస్తే... ముందు వరసలో రొమానియా దేశం ఉంది. ఆ తర్వాత పోర్చుగల్, లక్సెంబర్గ్, లిత్వేనియా, ఉక్రెయిన్ దేశాలు నిలిచాయి. ఇక మహిళల విషయానికొస్తే... ఉక్రెయిన్ మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత అండోర్ర, లక్సెంబర్గ్, బెలారస్, స్వీడెన్ దేశాలున్నాయి. మరోవైపు చాలా వరకు ముస్లిం దేశాల్లో మద్యం సేవించడమనేది లేదని రిపోర్ట్ వెల్లడించింది. ఇరాన్లో మద్యం సేవిస్తున్న మహిళలు సున్నాగా తేల్చింది. పాకిస్తాన్లో మద్యం సేవిస్తున్న పురుషులు చాలా తక్కువని రిపోర్ట్ తేల్చింది.