గుండెను మెలిపెట్టే ఫోటోలు : ఆస్ట్రేలియా కార్చిచ్చుకి విలవిల్లాడుతున్న మూగజీవాలు
ఆస్ట్రేలియాలో గతేడాది సెప్టెంబర్లో న్యూ సౌత్వేల్స్, క్వీన్స్లాండ్లో రాజుకున్న కార్చిచ్చు ఇప్పటికీ చల్లారడం లేదు. ఫలితంగా నెలల తరబడి లక్షల హెక్టార్ల అడవి తగలబడుతూనే ఉంది. ఇప్పటివరకు 60లక్షల హెక్టార్ల అడవి తగలబడగా.. అందులో దాదాపు 48కోట్ల మూగజీవాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. దాదాపు 900 ఇళ్లు తగలబడ్డాయి. కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రతలు సైతం పెరిగిపోయాయి. ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలు కూడా కార్చిచ్చును చల్లార్చేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కార్చిచ్చుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హృదయ విదారకంగా ఉన్న ఆ ఫోటోలు చూస్తే ఎవరి మనసైనా చలించకుండా ఉండదు.
ఆహుతైన కంగారూ.. :
పైన ఫోటోలో కనిపిస్తున్న కంగారూ పిల్ల అడిలైడ్ అడవుల్లో అగ్నికి ఆహుతైపోయింది. అడవిలోని ఫెన్సింగ్కి చిక్కుకుని మంటల్లో సజీవ దహనమైంది.
డీహైడ్రేషన్కు గురవుతున్న జంతువులు
కార్చిచ్చు కారణంగా డీహైడ్రేషన్కు గురైన కొన్ని జంతువులు నీటి కోసం మనుషుల వద్దకు పరిగెత్తుతున్న వీడియోలు కూడా వైరల్గా మారాయి. అడిలైడ్ అడవుల్లో నుంచి పారిపోయి రోడ్డు పైకి వచ్చిన ఓ జంతువుకు అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఇలా నీళ్లు తాగించాడు.
నీటి కోసం తపిస్తున్న మూగజీవాలు
NRMA వివరాల ప్రకారం.. కార్చిచ్చును ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఓ కోలా పిల్లా పరిగెత్తుకొచ్చి ఇలా సిబ్బందిపై వాలింది. డీహైడ్రేషన్కు గురై నీటి కోసమే అది అతని వద్దకు చేరినట్టు తెలిపారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు 4000 పశువులు,గొర్రెలు చనిపోయినట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిన్సన్ తెలిపారు. (Image credit : nrma.com.au)
కార్చిచ్చు ధాటికి విలవిల..
కార్చిచ్చును ఆర్పుతున్న సమయంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో.. మసిబారిపోయిన రెండు కోలా జంతువుల ఫోటోలు కూడా వైరల్గా మారాయి. న్యూ సౌత్ వేల్స్లో ఇప్పటివరకు 30శాతం అడవి తగలబడినట్టు పర్యావరణ విపత్తు మేనేజ్మెంట్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.