వడ దెబ్బ: పాక్ లో 700 మంది పిట్టల్లా రాలిపోయారు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని ప్రజలు భానుడి దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంటి నుండి బయటకు రాలేక అల్లాడి పోతున్నారు. పిల్లలు, వృద్దులు మృత్యువాత పడుతున్నారు. వేడి గాలులతో పాకిస్థాన్ ప్రజలు విలవిలలాడుతున్నారు.
గత శుక్రవారం నుండి పాకిస్థాన్ లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శుక్రవారం నుండి మంగళవారం వరకు 700 మంది వడ దెబ్బకు బలి అయ్యారు. పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఎక్కువ మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
దేశంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే భాద్యతను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అప్పగించారు. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
భానుడి దెబ్బకు ఇప్పటికే విధ్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సింధు ప్రావిన్స్ ప్రాంతాలలో ఇప్పటి వరకు 27,200 మంది బడ దెబ్బకు ఆసుపత్రిపాలైనారు. వడ దెబ్బ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.