హెలికాప్టర్ కూలి ఇద్దరు విదేశీ రాయబారులు సహా ఆరుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడి ఆర్మీ ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారు. మరణించిన వారిలో ఇద్దరు విదేశీ రాయబారులు, ఇద్దరు విదేశీ రాయబారుల భార్యలు ఉన్నారని పాక్ ఆర్మీ తెలిపింది.
శుక్రవారం 11 మంది విదేశీయులు, ఆరుగురు పాకిస్థానీలు కలిసి ఎంఐ-17 హెలిక్యాప్టర్ లో గిలిగిట్- బాల్తిస్థాన్ ప్రాంతానికి బయలుదేరారు. గిలిగిట్ ప్రాంతంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రెండు ప్రాజెక్ట్ లు ప్రారంభించనుండటం, ఆయన బహిరంగ సభ ఉండటంతో వీరిని అక్కడికి తీసుకు వెళుతున్నారు.
హెలికాప్టర్ లో ఫిలిపెన్స్ రాయబారి డోమింగో డి లుసేనారియో జూనియర్, నార్వే రాయబారి లీఫ్ హెచ్ లారెన్స్, మలేషియా, ఇండోనేషియా రాయబారుల భార్యలు, పోలండ్, డచ్ రాయబారులు ఉన్నారు. అయితే మార్గం మద్యలో గిలిగిట్ ప్రాంతంలోని ఒక పాఠశాల దగ్గర హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఫిలిపెన్స్, నార్వే రాయబారులు, పోలండ్, డచ్ రాయబారుల భార్యలు, ఇద్దరు పైలెట్లు మరణించారని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ సలీమ్ బాజ్వా తెలిపారు. పోలండ్, డచ్ రాయబారులకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించామని అన్నారు.
ఇద్దరు రాయబారుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రధాని నవాజ్ షరీఫ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మూడు హెలిక్యాప్టర్ లో విదేశీయులను తరలించే ఏర్పాట్లు చేశారు. రెండు హెలికాప్టర్ లు క్షేమంగా ల్యాండ్ అయ్యాయని, ఒకటి ఎందుకు కూలిపోయింది అని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.