కుప్పకూలిన హెలికాప్టర్: ఏడుగురి మృతి
ఖట్మండ్: ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ఓ చంటిబిడ్డతో సహ ఏడుగురు దుర్మరణం చెందారని నేపాల్ అధికారులు చెబుతున్నారు. సోమవారం ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు.
నేపాల్ రాజధాని ఖట్మాండుకు 150 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్ జిల్లాలో గల భతిన్ దండ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలిందని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు బయటకు తీయ్యడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
దిఫిష్ టెయిల్ ఎయిర్ కంపెనీకి చెందిన 9 ఎన్-ఏకేఏ అనే ప్రయివేట్ హెలికాప్టర్ లో నేపాల్ లోని గోర్ఖా ప్రాంతం నుంచి చంటి బిడ్డతో సహ ఏడుగురు బయలుదేరారు. ఆ ఏడు మందిలో పైలెట్ ఉన్నాడు.
హెలికాప్టర్ బయలుదేరిన కొంత సేపటికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో సిగ్నల్స్ తెగిపోయాయి.మద్నాహ్నం హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని సివిల్ ఏషియన్ అథారిటీ ఆఫ్ నేపాల్ అధికారులు అంటున్నారు.
విషయం తెలుసుకున్న నేపాల్ మిలటరీ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. వాతావరణం అనుకూలించకపోవడం వలనే హెలికాప్టర్ కుప్పకూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.