Coronavirus : చైనా వెలుపల మొదటి కరోనా మృతి కేసు, ఏయే దేశాల్లో ఎన్ని కరోనా కేసులు..
కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకు 300 మంది మృతి చెందారు. మరో 14వేల మందికి కరోనా సోకింది. చైనా వెలుపల మొట్టమొదటి కరోనా మృతి కేసు ఫిలీప్పీన్స్లో నమోదైంది. వుహాన్ పట్టణం నుంచి జనవరి 21వ తేదీన ఫిలీప్పీన్స్ వచ్చిన ఆ 44 వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. నిజానికి కొద్దిరోజులుగా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని భావించామని,కానీ 24గంటల్లోనే అనూహ్యంగా అతని ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయిందని ఫిలీప్పీన్స్ హెల్త్ సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం ఫిలీప్పీన్స్ కూడా చైనా,హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది.
ఏయే దేశాల్లో ఎన్ని కేసులు
ఇక ఇప్పటివరకు ఆయా దేశాల్లో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. థాయిలాండ్లో 19,జపాన్20,సింగపూర్ 18,దక్షణి కొరియా 15,మలేషియా 8,తైవాన్ 10,ఆస్ట్రేలియా 7,జర్మనీ 8,అమెరికా 8,ఫ్రాన్స్ 6,వియత్నాం 6,కెనడా 4,దుబాయ్ 5,రష్యా 2,ఇండియా 2,ఇటలీ 2,ఫఇన్లాండ్ 1,బ్రిటన్ 2,ఫిలీప్పీన్స్ 1,శ్రీలంక 1,నేపాల్ 1,స్పెయిన్ 1,స్వీడన్లో 1 కేసులు నమోదయ్యాయి.
కేరళలో రెండో కేసు..
ఇక చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎయిర్పోర్టులో వైద్య పరీక్షల అనంతరం వారందరినీ మానేసర్లోని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.ఇక తాజాగా కేరళలో మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. ఇటీవలే చైనా నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలినట్టు అధికారులు వెల్లడించారు. అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి అతని మెడికల్ రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎన్ఐవీ పుణే అధికారులు ఇప్పటికే తమను ఫోన్ ద్వారా సంప్రదించి కరోనా పాజిటివ్కి అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స
తాజా అనుమానిత కేసుకు సంబంధించిన వ్యక్తి ఇటీవలే చైనాలోని వుహాన్ నుంచి కేరళకు వచ్చినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ తెలిపారు. ప్రస్తుతం అలప్పుజా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని,ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
కేరళలో పరిస్థితి ఎలా ఉందంటే..
ఆ పేషెంట్లో కరోనా వైరస్కు సంబంధించి కొన్ని మైనర్ లక్షణాలు కనిపించాయని, అయితే దీన్ని అంత ఈజీగా తీసుకోవద్దని తాము నిర్ణయించుకున్నామని శైలజ అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ అని ధ్రువీకరించకపోయినా సరే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా,ఇటీవల కరోనా వైరస్ బారినపడిన దేశాలను సందర్శించి కేరళకు వచ్చిన దాదాపు 1793 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో 73 మందిని ఇప్పటికే ఐసోలేషన్ వార్డులో చేర్చారు. మరో 1723 మందిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు.