ఇండోనేసియా హీరో: భూకంపం ధాటికి టవర్ ఊగుతున్నా వందలాదిమందిని కాపాడి, మృతి
జకర్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం, ఆ తర్వాత సునామీ పెను విషాధాన్ని మిగిల్చాయి. శుక్రవారం సాయంత్రం సులవేసి దీవిలోని పాలూ నగరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణలో స్థానికులు ఉండగా సునామీ ముంచెత్తింది. సునామీలో 400 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడికక్కడ మృతదేహాలు కనిపించాయి.
దక్షిణ సులవేసి రాజధానిగా ఉన్న పాలూ నగరం జనాభా మూడున్నర లక్షలు. ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. సముద్రం నీరు రావడం, బిల్డింగులు కూలిపోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితుల్లో రోడ్ల పైన పరుగులు పెట్టారు. ప్రాణాలు రక్షించుకోవడానికి ఎంతో పొడవైన చెట్లు ఎక్కారు. ఆసుపత్రుల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ చాలామంది బయటే తలదాచుకుంటున్నారు.
హీరో... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మృతి
ఓ యువ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎంతోమందితో కూడిన విమానం సురక్షితంగా టేకాఫ్ అయ్యేలా చర్యలు తీసుకొని, ఆ తర్వాత ప్రకృతి విపత్తు నుంచి బయటపడేందుకు టవర్ నుంచి దూకి, అతను కన్నుమూసిన విషాధ సంఘటన చోటు చేసుకుంది. విమానం సక్రమంగా గాల్లో ఎగిరే వరకు తగిన సూచనలు చేశాడు 21 ఏళ్ల ట్రాఫిక్ కంట్రోలర్. ఎయిర్ కంట్రోల్ టవర్లో విధులు నిర్వర్తించిన అతను భూకంపం కారణంగా మరణించారు. ఈ విషయాన్నిఎయిర్నవ్ తెలిపింది. ఎంతోమందిని కాపాడిన ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పేరు అంతోనియస్ గుణవాన్ అగుంగ్. రిక్టర్ స్కేల్ పైన 7.5తో భూకంపం వచ్చినప్పుడు ముతియారా ఎస్ఐఎస్ ఏఐ-జుఫ్రీ విమానాశ్రయంలో పని చేస్తున్నారు.
టవర్ నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు
భూకంపం వచ్చినప్పుడు అతను కంట్రోల్ టవర్ పైన ఉన్నాడు. భూకంపం ధాటికి టవర్ ఊగిపోయింది. దీంతో ఎంతో మంది స్టాఫ్ మెంబర్లు పరుగులు తీశారు. కానీ గుణవాన్ మాత్రం అక్కడే ఉండి, ప్రయాణీకులతో కూడిన ఓ విమానం ఎలాంటి ప్రమాదానికి గురి కావొద్దని భావించి, అతను దానిని గైడ్ చేశాడు. భూకంపం ధాటికి టవర్ కొద్దికొద్దిగా కుంగిపోతోంది. అయినా అతను ఆ విమానాన్ని గైడ్ చేశాడు. అతని కారణంగా ఆ విమానం భద్రంగా అక్కడి నుంచి వెళ్లింది. విమానం క్షేమంగా వెళ్లిపోయాక కానీ అతను టవర్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించలేదు. విమానం వెళ్లగానే టవర్ నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. టవర్లోని నాలుగో అంతస్తు నుంచి దూకాడు. అప్పుడు అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అతనిని మరో పెద్ద ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్ తీసుకు వచ్చారు. కానీ హెలికాప్టర్ తెచ్చే సమయానికి అతను కన్నుమూశారు. ప్రయాణీకుల కోసం భూకంపం వస్తున్నా టవర్ పైనే ఉండి గైడ్ చేసిన అతనిని హీరోగా అభివర్ణించింది. అతను వందలాది మందిని కాపాడారని కితాబిచ్చారు.
వారంతా కొట్టుకుపోయి ఉంటారు
మరోవైపు, పాలూలోని జైలు గోడలు కూలిపోవడంతో అక్కడ ఉన్న 560 ఖైదీల్లో దాదాపు సగం మంది పారిపోయారు. అయితే ఇక్కడి పోలీసులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యామయ్యారు. పారిపోయిన ఖైదీలను పట్టుకొనే ప్రయత్నాలు చేయడం లేదని పోలీసు అధికారులు వెల్లడించారు. సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలో దించామని ఇండోనేసియా అధ్యక్షుడు తెలిపారు. ఇదిలా ఉండగా, వండర్ఫుల్ పాలూ నోమోనీ బీచ్లో వార్షిక ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న సమయంలో సునామీ ముంచెత్తింది. ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన వారి ఆచూకీ తెలియరాలేదు. ప్రదర్శనలు ఇవ్వాల్సిన కళాకారులు కూడా ఏమయ్యారో తెలియరాలేదు. ఎక్కువ మంది కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
ఆ పట్టణాల పైనా సునామీ ప్రభావం
భూకంపం కేంద్రీకృతమైన డొంగ్గల్లా, మాముజు పట్టణాలు కూడా సునామీ ప్రభావానికి గురయ్యాయి. రోడ్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా పాడవడంతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్బంది అవుతోంది. అక్కడి నుంచి ఎటువంటి సమాచారమూ అందడం లేదంటున్నారు. పాలూ నగరానికి దాదాపు 80 కి.మీ. దూరంలో ఉండడంతో వివరాలు వెంటనే తెలియడం లేదు.