ధోనీ, కోహ్లీల కంటే ఎంతో ఎక్కువ: టైగర్ వుడ్స్తో హీరో కళ్లు చెదిరే డీల్!
న్యూఢిల్లీ: టైగర్ వుడ్స్తో హీరో మోటార్ కార్ప్ కళ్లు చెదిరే మొత్తంలో ఒప్పందం కుదుర్చుకుంది! గోల్ఫ్ క్రీడకు విశేష ప్రాచుర్యం కల్పించిన ఆటగాళ్లలో అమెరికా జాతీయుడు టైగర్ ఉడ్స్ మొదటి వరుసలో ఉంటాడు. ఎన్నో వరల్డ్ టైటిల్స్, ప్రైవేట్ టోర్నీలు నెగ్గి మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు.
అతను గోల్ఫ్ ఆడితే వచ్చే పారితోషికం కంటే వాణిజ్య ఒప్పందాలతోనే వేలకోట్ల రూపాయలు ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా హీరో మోటోకార్ప్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. హీరో మోటార్ కార్ప్ భారత్లోనే కాకుండా పలు దేశాల్లోనూ బైక్ల అమ్మకాల్లో దూసుకెళ్తోంది.
ఈ హీరో మోటోకార్ప్ టైగర్ ఉడ్స్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అతనితో రూ.250 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇది నాలుగేళ్లకు. ఓ భారత కంపెనీ క్రీడాకారులతో కుదుర్చుకున్న అతి పెద్ద వాణిజ్య ఒప్పందం ఇదే. దీని ముందు భారత జట్టు క్రికెటర్ల ఒప్పందాలు కూడా తక్కువే.
భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి టాప్ స్టార్లు ఏడాదికి ప్రకటనల రూపేణా రూ.4-10 కోట్లు మాత్రమే ఆర్జిస్తున్నారు. టైగర్ ఉడ్స్తో ఒప్పందంపై హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజాల్ అమెరికాలోని ఓర్లాండోలో సోమవారం వివరాలు తెలిపారు.
టైగర్ గోల్ఫ్ చాంపియన్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆదర్శప్రాయుడని, వయసు, భాష, జాతీయత, భౌగోళిక హద్దులను చెరిపివేస్తూ అతని ప్రాభవం ఖండాంతరాలకు వ్యాపించిందని పేర్కొన్నారు. మున్ముందు ఫుట్బాల్ క్రీడాకారులతో సహా ఇతర క్రీడలకు చెందిన స్టార్లతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు.
ఒప్పందంపై ఉడ్స్ మాట్లాడుతూ... హీరోతో ఒప్పందం కుదరడం పట్ల ఉద్విగ్నతకు లోనయ్యానన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ వచ్చానని, అక్కడ పవన్ ముంజాల్ను కలిసి, అతడితో గోల్ఫ్ కూడా ఆడానని, ఆ తర్వాత ఇద్దరం రెండుసార్లు కలుసుకున్నామని, కొన్ని చర్చలు కూడా జరిగాయని, ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరిందన్నారు.