1,83,020 కరోనా కేసులు, సింగిల్ డే హైయస్ట్ రికార్డ్, బ్రెజిల్ 50 వేలకు పైగా, అమెరికాలో మృత్యుఘోష..
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 24 గంటల్లోనే లక్షా 83 వేల కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 54 వేల కేసులతో బ్రెజిల్ టాప్ ప్లేస్లో ఉండగా.. అగ్రరాజ్యం అమెరికాలో 36 వేల కేసులు ఉన్నాయి. భారతదేశం 10 వేల మార్క్ని దాటి 15 వేలకు చేరి.. ప్రమాదపు ఘంటికలు మోగిస్తోంది.
Recommended Video
కరోనా వైరస్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం.. వైరస్ వ్యాప్తి పెరుగుతోందని.. దీనికితోడు వైరస్ పరీక్షలు కూడా గణనీయంగా పెరగడమేనని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. ఆదివారం కలిపి 87 లక్షల 8 వేల 8కి పాజిటివ్ కేసులు చేరగా.. మృతుల సంఖ్య 4 లక్షల 61 వేల 715కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 4 వేల 743 మంది చనిపోయారు. ఈ మృతుల్లో మూడింట రెండొంతుల మంది అమెరికాకు చెందినవారే ఉన్నారు.
మూడు నెలల లాక్ డౌన్ తర్వాత స్పెయిన్ అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారు. దీంతో దేశంలోని 47 మిలియన్ల మంది తిరిగేందుకు అవకాశం ఏర్పడింది. దీంతోపాటు వీసా లేని 26 యూరొపియన్ యూనియన్ సహా బ్రిటన్ నుంచి పర్యాటకులు స్వేచ్చగా వచ్చేందుకు అవకాశం కల్పించింది. 14 రోజుల క్వారంటైన్ నిబంధన వర్తించబోదు అని ప్రకటించింది.