బెంజ్ కు బాబు..బాంబులు వేసినా చెక్కు చెదరదు: జిన్ పింగ్ కారు ప్రత్యేకతలెన్నో!
చెన్నై: మరి కొన్ని గంటలు. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ భారత పర్యటన ఆరంభం కాబోతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. చెన్నై నగర శివార్లలోని మామళ్లాపురం (మహాబలిపురం)లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. జిన్ పింగ్ పర్యటన కోసం ఆయన కాన్వాయ్ లోని నాలుగు కార్లు ఇదివరకే చెన్నైకి వచ్చాయి. ఎయిరిండియా కార్గో విమానంలో అయిదురోజుల కిందటే చెన్నైకి వచ్చాయి. జిన్ పింగ్ ఆ కార్లలోనే ప్రయాణిస్తారు. ఈ నాలుగింట్లో జిన్ పింగ్ ప్రయాణించే కారుకు ఉన్న ప్రత్యేకతలు ఎన్నో.
బాంబులు వేసినా చెక్కు చెదరదు..
సాధారణంగా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ప్రయాణించే కార్లు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. చైనా అధ్యక్షుడు ప్రయాణించే కారును బుల్లెట్లు కాదు కదా.. శక్తిమంతమైన బాంబులు వేసినా చెక్కు చెదరదు. చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ హాంగ్ క్వి దీన్ని తయారు చేసింది. ఎల్ - 5 సిరీస్ లో ఈ కారును రూపొందించింది. దీని ఖరీదు సుమారు ఆరు కోట్ల రూపాయలు. ఎఫ్ ఏ డబ్ల్యూ గ్రూప్ కు చెందిన సంస్థ హాంగ్ క్వి 1958లో కార్ల తయారీని ఆరంభించింది. చైనాలో ఆటోమొబైల్ రంగంలో ఏర్పాటైన మొట్టమొదటి సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. హాంగ్ క్వి అంటే చైనా భాషలో `ఎర్రజెండా` అని అర్థం. చైనా సాంస్కృతిక రంగానికి ఉపయోగించే చిహ్నం.. ఈ సంస్థ లోగో.
జిన్ పింగ్ పర్యటన వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు.. కానీ: కేంద్రమంత్రి జైశంకర్ కుమారుడి కామెంట్స్!
తయారీ కంటే.. ఇంటీరియర్ ఖరీదే అధికం
చైనా అధ్యక్షుడి కారు తయారీ ఒక ఎత్తయితే.. దాని ఇంటీరియర్ ఖర్చు ఇంకో ఎత్తు. బుల్లెట్ ప్రూఫ్ గా మార్చడానికి, బాంబులు వేసినా తట్టుకునే శక్తిని కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. చైనా రక్షణ శాఖ అందించే నిబంధనలకు అనుగుణంగా ఈ కారును తయారు చేయాల్సి ఉంటుంది. చైనాలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా ఉంటుంది ఈ హాంగ్ క్వి ఎల్-5. బెంట్లే, రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్ల కంటే రేటెక్కువ. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, శక్తిమంతమైన బాడీని కలిగి ఉంటుంది. 12 వాల్వులు ఉండే ఈ కారు ఇంజిన్.. ఎనిమిది సెకెన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అత్యంత విలాసవంతమైన మెర్సిడెజ్ బెంజ్ కు చెందిన ఎస్ 600 పుల్ మ్యాన్ గార్డ్ రకానికి చెందిన కారు కంటే ఓ అడుగు పొడుగే ఉంటుంది హాంగ్ క్వి ఎల్-5. 5.24 అడుగుల పొడుగు, అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది.
ఏ దేశమేగినా.. ఇందులోనే కాాలిడే చైనా అధ్యక్షుడు..
చైనా అధ్యక్షుడి హోదాలో జిన్ పింగ్ ఏ దేశ పర్యటనకు వెళ్లినప్పటికీ.. ఆయన వెంట ఈ నాలుగు కార్ల కాన్వాయ్ బయలుదేరి తీరాల్సిందే. అధ్యక్షుడి పర్యటన తేదీ కంటే కనీసం నాలుగు రోజులు ముందుగానే ఆ దేశానికి చేరుకుంటాయి. ఈ నాలుగింట్లో ఒకటి అధ్యక్షుడు ప్రయాణించే కారు.. మరొకటి పైలెట్, మిగిలిన రెండూ భద్రత, వ్యక్తిగత సిబ్బంది కోసం కేటాయిస్తారు. జిన్ పింగ్ ప్రయాణించే మార్గంలో రెండు సార్లు మార్చ్ నిర్వహిస్తాయి. అన్నీ సజావుగా ఉన్నాయనుకున్న తరువాతే బయటికి కదులుతాయి. ఎలాంటి చిన్న పొరపాటునైనా సరి చేయక తప్పదు. ఆ బాధ్యత జిన్ పింగ్ పర్యటించే దేశ ప్రభుత్వం మీదే ఉంటుంది.
గ్రాండ్ చోళ హోటల్ లో బస
తన పర్యటన సందర్భంగా జిన్ పింగ్.. చెన్నై గిండీ ప్రాంతంలోని ఐటిసి గ్రాండ్ చోళలో బస చేస్తారు. సాయంత్రం 4 గంటలకు చోళ నుంచి మామళ్లాపురానికి బయలుదేరి వెళ్తారు. అయిదు గంటలకు మామళ్లాపురంలోని అర్జున్ తపస్వి మండపం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం మహాబలిపురాన్ని సందర్శిస్తారు. సాంస్కతిక కార్యక్రమాల వీక్షణ కొనసాగుతుంది. రాత్రి 8 గంటలకు జిన్ పింగ్ తిరిగి ఐటిసి గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. మరుసటి రోజు మళ్లీ మామళ్లాపురానికి బయలుదేరి వెళ్తారు. ప్రధానమంత్రితో అధికారిక భేటీ ఉంటుంది.