ఏడేళ్ల కొడుకుకు తల్లిగా ఆమె నాకు తెలుసు: క్లింటన్
వాషింగ్టన్: మాలి ఉగ్రదాడిలో ఇండో అమెరికన్ స్వచ్ఛంద కార్యకర్త అనిత దాతర్ మృతి పట్ల అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సంతాపం వ్యక్తం చేశారు. సెనెట్ రోజుల నుంచే ఆమె తనకు వ్యక్తిగతంగా తెలుసని, ఆమె మృతి బాధాకరమన్నారు.
41 ఏళ్ల అనితా దాతర్ సమాజ సేవే జీవిత సర్వస్వంగా మార్చుకుని స్వచ్ఛంద కార్యకర్తగా మాలిలో పనిచేస్తూ, గత వారంలో జరిగిన ఉగ్రవాద దాడిలో బలైన సంగతి తెలిసిందే. గత శుక్రవారం మాలి దేశ రాజధాని బమాకాలోని రాడిసన్ బ్లూ హోటల్లోకి ఉగ్రవాదులు చొరబడి 27 మందిని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే.
మాలి దాడిలో మరణించి ఏకైక భారత సంతతికి చెందిన అమెరికన్ మహిళ ఆమె. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్ అనితా దాతర్ మృతిపై శనివారం స్పందించారు.
'ఆమె నాకు తెలుసు. ఏడేళ్ల కొడుకు తల్లిగా, నా విధాన సలహాదారుల్లో ఒకరైన డేవిడ్ గార్టన్ మాజీ భార్యగా ఆమెతో నాకు పరిచయముంది' అని హిల్లరీ క్లింటన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
'ఈ విషాద సమయంలో దాతర్, గార్డెన్ కుటుంబాలకు మద్దతుగా నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అనిత, డేవిడ్ ఏడేళ్ల కొడుకు గురించి నేను ఆలోచిస్తున్నాను. రానున్న రోజులను అతను ఎలా ఎదుర్కొంటాడో? ఎన్ని కష్టాలు పడతాడో? అని ఆలోచిస్తేనే ఎంతో బాధ కలుగుతుంది' అని ఆమె అందులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అమాయక ప్రజలపై జిహాదీ పేరుతో ఉగ్రదాడులకు తెగబడుతున్న ఐఎస్ఎఐస్, ఆల్ఖైదాపై వెంటనే అమెరికా యుద్ధాని ప్రారంభించి, విజయం సాధించాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు.