బంగ్లాలో కత్తులతో పొడిచి మరో హిందూ పూజారి హత్య
ఢాకా: గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయి. మతపెద్దలను, ప్రొఫెసర్లను అతి కిరాతకంగా చంపేస్తున్నారు ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులు. తాజాగా మరో హిందూ పూజారిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెనైదా ప్రాంతంలో శ్యామనందో దాస్ అనే హిందూ పూజారి హత్యకు గురయ్యారు. దాస్ దేవతార్చన కోసం పూలు కోస్తుండగా.. ముగ్గురు దుండగులు బైక్పై వచ్చి.. కత్తులతో పొడిచి హతమార్చారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు.
ఈ ఘటనలో దాస్ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. జెనైదా జిల్లాలో జూన్ 7న కూడా ఓ హిందూ పూజారి హత్య గురైన విషయం తెలిసిందే.
హిందూవులతో పాటు.. క్రిస్టియన్ పౌరులు, మైనార్టీకి చెందిన ప్రొఫెసర్లపై దాడి చేసి చంపేస్తున్నారు ఉగ్రవాదులు, ఉగ్ర సానుభూతిపరులు. ఈ ఘటనలతో బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్లు, ఇతర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.