త్యాగాలకు ప్రతీక.. సామాజిక రుగ్మతలకు సమాధానం.. బక్రీద్ విశిష్టతలివే...
నిబద్థత, విధేయత అనే పదాలకు అర్ధమే కరువవుతున్న నేటి సమాజంలో ప్రజలకు చరిత్రలో వాటి విశిష్టతను తెలియచెప్పే సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. వీటిలో అత్యంత అరుదైన వాటిలో ఒకటైన ఈద్ ఉల్-అజహాగా పిలిచే బక్రీద్ పండుగ కూడా ఉంటుంది. ముఖ్యంగా ముస్లింల చరిత్రలో హద్దుల్లేని త్యాగనిరతికి, అనిర్వచనీయమైన దైవారాధనకు మారు రూపంగా నిలిచే ఓ అరుదైన ఘటనను నేటి తరానికి గుర్తు చేయాలంటే బక్రీద్ పండుగ సందర్భం తెలుసుకుని తీరాల్సిందే. ఈ ఘటన గొప్పతనం తెలిస్తే ఈ నాటి సమాజంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో రుగ్మతలకు సమాధానం కూడా ఇట్టే దొరుతుతుందనడం అతిశయోక్తి కాదు.
బక్రీద్ పండుగ చరిత్ర..
ముస్లింలకు దిశానిర్దేశం చేసేందుకు అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్. ఇస్లాం క్యాలెండర్లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆధునిక సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమండలానికి 80వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్యగ్రంథం దివ్యఖురాన్ చెబుతోంది.
వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అల్లాహ్పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లాహ్ అనేక పరీక్షలతో పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ పేర్కొంది.
చరిత్రలో అరుదైన త్యాగం...
తన ప్రవక్తలను అల్లాహ్ వివిధ సందర్భాల్లో భిన్న రూపాల్లో పరీక్షించేవారు. ఇదే క్రమంలో ప్రవక్త హజరత్ ఇబ్రహీం, ఆయన భార్య హజీరాలకు వారి వృద్ధాప్యంలో సంతానప్రాప్తి కలిగింది. లేక లేక జన్మించిన కుమారుడు ఇస్మాయిల్ను వృద్ధ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్ను అల్లాహ్పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటారు. దీంతో అల్లాహ్ తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ను బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడతారు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్ కూడా అల్లాహ్ మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడ్డారు.
బలిచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డువస్తే. తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లాహ్తో విశ్వాసఘాతకుడిగా నిలవకుండా, కళ్లకు గంతలతో తనను బలి ఇవ్వమంటూ తండ్రికి సూచిస్తారు. ఆ మేరకు అల్లాహ్ నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తిపెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లాహ్ ఆఖరు క్షణంలో అల్లాహ్ ఇస్మాయిల్ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబా (పొట్టేలు) ను ప్రత్యక్షం చేస్తారు. దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్ మార్గంలో అది ఖుర్బాన్ అవుతుంది. ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్ ఆరోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండగ రోజు జంతు బలి ఇవ్వాలనీ, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతోంది.
ఆధునిక సమాజంలో..
అలా ఇబ్రహీం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్మాయిల్ ప్రాణత్యాగానికి సిద్దపడిన రోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు నేటికీ బక్రీద్ పండుగ జరుపుకుని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటుంటారు. త్యాగానికి గుర్తుగా తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న మేకలు, పొట్టేళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలా తాము ఎంతో ఆత్మీయంగా పెంచుకున్న మూగజీవాలను బలివ్వాల్సిన వచ్చే సందర్భంలో త్యాగం విలువ అర్ధమవుతుందని, ఇది భవిష్యత్ జీవితానికీ మార్గదర్శనం చేస్తుందని ముస్లింల నమ్మకం. అందుకే శతాబ్దాలుగా బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకున్న తర్వాత ఈ బలిదానం చేస్తారు. తద్వారా మానవ జీవితంలో త్యాగనిరతికి ఉన్న ప్రత్యేకతను గుర్తు చేసుకుంటుంటారు.
Recommended Video
బక్రీద్ మాసంలో హజ్ యాత్ర...
ముస్లిం సంవత్సరాది ప్రకారం హిజ్రీ శకం 9వ సంవత్సరంలో హజ్ యాత్ర విధిగా మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ సౌదీ అరేబియాలోని మక్కాకు ఈ యాత్ర ఏటా సాగుతోంది. అప్పుడప్పుడూ అవాంతరాలు ఎదురైనా హజ్ యాత్రకు పెద్దగా ఆంటకాలు కలుగలేదు. ఈ ఏడాది కరోనా విజృంభణ కొనసాగుతున్నందున విదేశీయులను సౌదీ ప్రభుత్వం అనుమతించలేదు.
స్వదేశీ యాత్రికులతో భౌతిక దూరం, ఇతర నిబంధనలు, పలు జాగ్రత్తలతో కొనసాగిన హజ్ యాత్ర నిన్న ముగిసింది. స్ధానిక కాలమానం ప్రకారం గల్ఫ్ దేశాల్లో బక్రీద్ పండుగ ఇవాళ జరుపుకుంటుండగా.. భారత్ లో మాత్రం రేపు ( శనివారం) బక్రీద్ వేడుకలు జరగనున్నాయి. ఈ సారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలతో మసీదులో ప్రార్ధనలకు పరిమిత సంఖ్యలో ముస్లింలను అనుమతిస్తున్నాయి.