నాలుగోసారి ఎయిరిండియా విమానాలపై నిషేధం విధించిన హాంగ్కాంగ్
న్యూఢిల్లీ/హాంకాంగ్: భారత ప్రభుత్వం విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాలపై హాంగ్కాంగ్ మరోసారి నిషేధాన్ని విధించింది. తాజాగా విధించిన నిషేధం నవంబర్ 10 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, హాంగ్కాంగ్ ప్రభుత్వం ఎయిరిండియా విమానాలను నిషేధించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
భారత్ నుంచి హాంగ్కాంగ్ దేశానికి చేరుకున్న కొందరు ప్రయాణికులకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. భారత్ నుంచి హాంగ్కాంగ్కు వచ్చే ప్రయాణికుల్లో 72 గంటల ముందుగా కరోనా నెగిటివ్ అనే ధృపత్రం సమర్పించిన వారిని మాత్రమే అనుమతిస్తామని అక్కడి ప్రభుత్వం జులైలో జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
అంతేగాక, తమ ప్రయాణికులెవరికీ కరోనా సోకలేదని విమానయాన సంస్థలు కూడా ఓ ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ నిబంధనలు భారత్ తోపాటు బంగ్లాదేశ్, ఇథియోపియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, కజకిస్థాన్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యూకే, యూఎస్ దేశాలకు కూడా పాటించాల్సిందే.
ఇక అంతర్జాతీయ ప్రయాణికులందరికీ హాంగ్కాంగ్ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా ఉంది. ఈ వారం ముంబై నుంచి హాంగ్కాంగ్కు ప్రయాణించిన కొందరు ప్రయాణికులకు ఇక్కడికి చేరిన అనంతరం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే ఎయిరిండియా విమానాలపై మరోసారి నిషేధం విధించినట్లు తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు మార్చి 23 నుంచి భారతదేశంలో నిలిపివేయబడిన విషయం తెలిసిందే.