మిషన్ శక్తి: అప్రమత్తమైన చైనా..ఆచితూచి స్పందన
బీజింగ్: అంతరిక్షంలో ఉపగ్రహాలను కూల్చివేయడానికి అవసరమైన క్షిపణిని మనదేశం విజయవంతంగా ప్రయోగించడం పట్ల చైనా ఆచితూచి స్పందించింది. మిషన్ శక్తిలో భాగంగా.. డీఆర్డీఓ, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఉదయం ప్రకటించారు. ప్రధాని చేసిన ఈ ప్రకటన పట్ల చైనా అప్రమత్తమైంది. మిషన్ శక్తి తీరుతెన్నులపై నిఘా వేసింది.
మిషన్ శక్తి ప్రయోగాన్ని స్వాగతించడం గానీ, వ్యతిరేకించడం గానీ చేయలేదు చైనా. క్లుప్తంగా ఓ ప్రకటన చేసింది. అంతరిక్షంలో ఎలాంటి ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత భారత్ పై ఉందని అంటూ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత్ మాత్రమే కాకుండా..క్షిపణి ద్వారా ఉపగ్రహాలను కూల్చివేయగల సామర్థ్యాన్ని సాధించిన అన్ని దేశాలు కూడా అంతరిక్షంలోనూ శాంతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ తరహా అంతరిక్ష, సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా, ఒకప్పటి సోవియట్ రష్యా, చైనాలు ఇప్పటికే ఉపగ్రహాలను పేల్చివేయగల సామర్థ్యం ఉన్న క్షిపణులను రూపొందించాయి. తాజాగా భారత్ కూడా ఆ దేశాల జాబితాలో చేరింది. శతృదేశాల ఉపగ్రహాలను పేల్చి వేయడం వల్ల కమ్యూనికేషన్లు, ఇంటర్ నెట్, ఇమెయిళ్లు, వీడియో కాన్ఫరెన్స్ వంటి కీలక వ్యవస్థలను నాశనం చేయడానికి అవకాశం ఏర్పడింది. తాము శాంతిని కాపాడుకోవడానికే ఈ తరహా క్షిపణిని రూపొందించినట్లు ప్రధాని ప్రకటించారు. వసుధైక కుటుంబకం అనే సూత్రానికి కట్టుబడి ఉంటామని అన్నారు.
చైనా వ్యక్తం చేసిన ఆందోళనకు మనదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించింది. భూభాగంపైనే కాకుండా, అంతరిక్షంలోనూ తాము శాంతిని కాపాడటంలో ముందుంటామని ఆ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఆయుధీకరణకు తాము వ్యతిరేకమని అన్నారు. అంతరిక్షాన్ని ఆధారంగా చేసుకుని తాము ఎలాంటి దాడులకూ పాల్పడబోమని భరోసా కల్పించింది.