అలీబాబా అధ్బుతం: ఆన్లైన్ అమ్మకాల్లో రికార్డు
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వినియోగదారులు ఆన్ లైన్ కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారనడంలో ఇదొక ఉదాహరణ. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఆన్లైన్ లో రికార్డు విక్రయాలను సాధించింది.
సోమవారం చైనాలో "సింగిల్స్ డే" షాపింగ్ బొనాంజాలో తొలి గంటలోనే 2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను విక్రయించింది. ఇక రోజు మొత్తం మీద 9.34 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 56,00 కోట్లు) విక్రయించింది. అందులో 42.6 శాతం లావాదేవీలు మైబైల్ ద్వారా చేసినవి కావడం విశేషం.
నవంబర్ 11న ఎక్కువ ఒకట్లు (11.11) వస్తాయి కాబట్టి ఆ రోజున "సింగిల్స్ డే" పేరిట 2009 నుంచి ఆలీబాబా ఈ భారీ స్ధాయి డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. అమెరికాలోని సైబర్ మండే, బ్లాక్ ఫ్రైడేల తరహాలోనే ఇది కూడా ఉంటుంది.
అమెరికాలో ఎంతో గొప్పగా జరుపుకునే థాంక్స్ గివింగ్ డే, సైబర్ మండే, బ్లాక్ ఫ్రైడే.. ఈ మూడు కలిసి గత ఏడాది 3.7 బిలియన్ డాలర్ల విక్రయాలను నమోదు చేశాయని ఇంటర్నెట్ అనలిటిక్స్ సంస్ధ కామ్ స్కోర్ వెల్లడించింది. దీనిని ఈ ఏడాది అంతర్జాతీయంగా విస్తరించారు.
తొలి గంట 12 సెకన్లలోనే 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ డీల్స్ జరిగాయి. ఈ ఏడాది సింగిల్స్ డేలో 27,000 పైగా బ్రాండ్లు కంపెనీలు పాల్గొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 220 దేశాల్లోని వినియోగదారులు ఈ 24 గంటల షాపింగ్లో పాల్గొన్నారు.
సింగిల్స్ డేలో చైనాకు చెందిన జియోమి మొబైల్ కంపెనీ ఏకంగా 10 లక్షలకు పైగా హ్యాండ్ సెట్లను విక్రయించింది. చైనాలో అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ అయిన ఆలీబాబా తన రిటైల్ వెబ్ సైట్ "టి-మాల్", "తౌబా" ద్వారా ఈ విక్రయాలు జరుపుతుంది. ఇక చైనా బయట అలిఎక్స్ప్రెస్, టిమాల్ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా విక్రయాలు జరుపుతుంది.