అమెరికా తలరాతను మార్చేసిన కరోనా.. ఈ వైఫల్యానికి ట్రంప్ కారణమా..?మరీ ఇంతలానా..!
న్యూయార్క్: కరోనావైరస్ అనే ఒక సూక్ష్మ బిందువు అగ్రరాజ్యం అమెరికానే గడగడలాడించింది. సాంకేతికపరంగా ఆర్థికంగా ప్రపంచదేశాలకంటే ఎన్నో రెట్లు ముందున్న అగ్రరాజ్యం అమెరికాను ఒక్క సూక్ష్మబిందువు వైరస్ తనకు దాసోహం అయ్యేలా చేసింది. ఇసుక రేణువు కంటే చిన్నదైన ఈ వైరస్ బిందువు అమెరికాను వణికిస్తోంది. అయితే అమెరికా మాత్రం ఈ వైరస్పై పోరాటంలో విఫలమైందనే చెప్పాలి. అమెరికా అజాగ్రత్త చర్యల వల్ల ఇప్పుడు అగ్రరాజ్యంలో వ్యాధి కల్లోలం సృష్టిస్తుండగా అదే సమయంలో ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయింది. అంతేకాదు ప్రపంచ దేశాల సరసన ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి అమెరికాకు దాపురించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి: డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్
విజృంభిస్తోన్న వైరస్
అమెరికాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రపంచం మొత్తం జనాభాలో 4శాతం అమెరికా జనాభా ఉండగా ఇందులో పావువంతు కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యే ఉంది. ఇది కేవలం అంచనామాత్రమే. వాస్తవ గణాంకాలు మరోలా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో ఇప్పటికీ కరోనా పరీక్షలు జరగాల్సిన స్థాయిలో జరగడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు కరోనావైరస్పై పోరు చేసేందుకు అన్ని వెసులుబాటులు అందుబాటులో ఉన్నప్పటికీ అమెరికా మాత్రం వ్యాధిని అంతమొందించడంలో విఫలమైంది. పరిశోదనా సంస్థలు, సాంకేతికత, శాస్త్రవేత్తల నైపుణ్యత ఇలా అన్ని అంశాల్లో ముందున్నప్పటికీ ఎందుకో అమెరికా మాత్రం కరోనా కట్టడిలో విఫలమైంది. మరి ఇతర చిన్న దేశాల్లో మాత్రం కరోనావైరస్ కట్టడిలో ముందున్నాయి. వ్యాధి సీరియస్నెస్ తెలిసి కూడా ట్రంప్ సర్కార్ దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో నేడు ఈ పరిస్థితి దాపురించిందని పలువురు నిపుణులు తమ అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.
కరోనాను సీరియస్గా తీసుకోని ట్రంప్
ముందుగా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు మానేసి ట్రంప్ ప్రభుత్వం నవంబర్ నెలలో వస్తున్న అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వ్యాధులను లేదా వైరస్లను అమెరికా చూసింది. కానీ ఈ వైరస్ను మాత్రం ఎందుకంత సీరియస్గా తీసుకోవడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.అంతేకాదు సాధారణంగా అమెరికా ప్రభుత్వం ప్రజాఆరోగ్య వ్యవస్థపై బాగానే ఖర్చు చేస్తుంది. కానీ కరోనావైరస్ ఇంతటి కల్లోలం జరుగుతున్న ఆరోగ్య రంగానికి కేటాయించి మొత్తం బడ్జెట్లో కేవలం 2.4శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తోంది. కరోనావైరస్కు ముందే పలు ఇతర జబ్బులతో అమెరికా ప్రజలు అల్లాడిపోయారు.. ఇంకా అల్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కరోనా మరో శాపంలో అమెరికన్లకు తయారైంది.
జనవరిలోనే వైరస్ సంకేతాలు..
ఇదిలా ఉంటే అమెరికాలో దశాబ్దాలుగా జాతివివక్ష కొనసాగుతోంది. దీంతో కరోనాబారిన పడ్డ కొందరు నల్లజాతీయులకు సరైన చికిత్స అందడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక కరోనావైరస్ గురించి ట్రంప్కు జనవరిలోనే సంకేతాలు అందినప్పటికీ పలువురు ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని పెడిచెవిన పెట్టారు. అప్పుడే కనుక ట్రంప్ కరోనావైరస్ పరిస్థితిని సీరియస్గా తీసుకుని ఉంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనావైరస్పై దృష్టి సారించడం మానేసి సరిహద్దులపై దృష్టి సారించారు. జనవరి 31న ఒక కీలక ప్రకటన చేశారు. చైనాకు వెళ్లిన విదేశీయులు దేశంలోకి అడుగుపెట్టరాదని ఆంక్షలు విధించారు. అదే సమయంలో చైనాకు ఎవరూ వెళ్లకూడదని హుకూం జారీ చేశారు.
Recommended Video
సమయానికి స్పందించి ఉంటే మరోలా ఉండేదేమో
ఇదిలా ఉంటే అమెరికాలో జనవరి మధ్యలో వైరస్ ప్రవేశించింది. అప్పటికీ ఒక్క వాషింగ్టన్ నగరంలో మాత్రమే కేసులు బయటపడ్డాయి. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే అమెరికాలో ఈ ఘోరకలి జరిగి ఉండేది కాదు. ఫిబ్రవరి వరకు దేశంలో వైరస్ తీవ్రత అంతగా కనిపించలేదు. మొత్తానికి అమెరికాలో వైరస్ ఈ రోజు ఇంతటి ప్రాణనష్టం చేకూర్చిందంటే అన్ని వేళ్లు ట్రంప్ వైపే చూపిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ సకాలంలో స్పందించి ఉంటే అమెరికాకు ఉన్న సాంకేతికత, వైద్య వ్యవస్థతో చాలావరకు వైరస్కు అడ్డుకట్టవేసి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా కల్లోలానికి ట్రంప్ ఒక్కడే కారణం కాదు అయితే అతని నిర్ణయాల మూలంగానే ఈ విపత్తు సంభవించిందని చాలామంది చెబుతున్నారు.